
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రావడానికి తన పాపం కూడా ఉందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. 2004లో బీఆర్ఎస్ కు తన నాన్న ధర్మపురి శ్రీనివాస్ రెండో మూడో సీట్లు ఇస్తే బాగుండేదని.... కానీ ఎక్కువ సీట్లు ఇచ్చి బీఆర్ఎస్ను బతికించారని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను కూడా తన నాన్నకు సహకరించానని..... కేసీఆర్ అధికారంలో ఉన్నరంటే తన పాపం కూడా ఉందని చెప్పారు. ఆ పాపం పోగొట్టుకోవడానికే 2019 ఎన్నికల్లో కవితనను ఓడగొట్టానని వెల్లడించారు. హైదరాబాద్ ఇందిరా పార్కులో బీజేపీ చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు.
Also read :- ప్లాన్ ప్రకారమే నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అన్యాయం: కిషన్ రెడ్డి
నిజామాబాద్ లో గెలుస్తానని ఎమ్మెల్సీ కవిత గప్పాలు కొడుతోందని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. కవిత తన మీద గెలుచుడు కాదు..ఈ ఎన్నికల్లో ఆమె మూడో ప్లేస్ కు వెళ్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ను ఓడగొట్టేందుకు బీజేపీలో కిషన్ రెడ్డి నాయకత్వంలో తానే ముందు నడుస్తానని తెలిపారు.
కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ అర్వింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు వస్తాయి..ఇన్ని సీట్లు వస్తాయంటూ వారి సొంత ఛానళ్లలో గప్పాలు కొట్టుకున్నా..రాష్ట్రంలో మాత్రం బీజేపీయే అధికారంలోకి వస్తుందని మరోసారి స్పష్టం చేశారు. అందుకే కిషన్ రెడ్డికి జాతీయ నాయకత్వం అధ్యక్ష పదవి కట్టబెట్టిందని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లపై క్లారిటీ ఉండదని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ఒక వేళ క్లారిటీ ఉన్నా...పరీక్ష సరిగా నిర్వహించరని..నిర్వహించినా..పేపర్ లీక్ చేస్తారని ఆరోపించారు. కేంద్రం పరీక్షలు పెట్టినప్పుడు కేసీఆర్ తెలంగాణలో పరీక్షలు పెడుతున్నారని వెల్లడించారు. నిరుద్యోగులే పరీక్షలు వాయిదా వేయాలని అడిగేలా ప్లాన్ చేస్తున్నారని..ఇది కేసీఆర్ తెలివి అని స్పష్టం చేశారు.