తొమ్మిదేళ్లయినా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేశారని.. 1200 మంది విద్యార్తులు బలిదానం చేశారని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలపై ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నోటిఫికేషన్స్ ఇవ్వకుండా సర్కార్ యువతను మోసం చేస్తోందని మండిపడ్డారు. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకై లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ధ్వజమెత్తారు.
కుంభకోణాలు మీరు చేసి కేసులు తమ మీద పెడతారా? అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. పేపర్ లీకేజీపై పోరాడితే బండి సంజయ్ పై కేసులు పెట్టారని ఆరోపించారు. ఉద్యోగాలపై అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగులకు పథకం ప్రకరామే సర్కార్ అన్యాయం చేస్తుందన్నారు.
హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదని.. అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు కిషన్ రెడ్డి . వాటాలిస్తే గానీ ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడం లేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేశారని.. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మిగులురాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు.