10 వికెట్లతో చెలరేగిన మానవ్ సుతార్.. తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం

10 వికెట్లతో చెలరేగిన మానవ్ సుతార్.. తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం

 IND vs SL: గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు శ్రీలంకపై 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ సాధించిన అద్భుతమైన సెంచరీ (167) జట్టుకు బలమైన పునాది వేయగా, స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసుకుని శ్రీలంక జట్టుని దెబ్బ కొట్టాడు. 372 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య లంక జట్టును ఇండియన్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 206 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు.

అర్ధసెంచరీలతో లంక పోరాటం.. కట్టడి చేసిన జడేజా, ప్రసిద్ధ్:

ఆట ఆఖరి రోజు శ్రీలంక 84/4 స్కోరు వద్ద ఉండగా, విజయం కోసం ఇంకా 288 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఇన్నింగ్స్ ప్రారంభించింది. సోనాల్ దినుషా, కెప్టెన్ ధనంజయ డి సిల్వా ధైర్యంగా ఆడుతూ అర్ధసెంచరీలతో లంకను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మొదటి 90 నిమిషాల పాటు భారత బౌలర్లను విసిగించిన ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీశాడు. 54 పరుగులు చేసిన ధనంజయను జడేజా అవుట్ చేసి భారత్‌కు కీలకమైన బ్రేక్‌త్రూ అందించాడు. ఆ వెంటనే పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ విజృంభించి నిరోషన్ డిక్వెల్లాను పెవిలియన్ బాట పట్టించడంతో శ్రీలంక గెలుపు ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి.

ఒకే ఓవర్లో 3 వికెట్లు.. సుతార్ చారిత్రాత్మక రికార్డు: 

అనంతరం మానవ్ సుతార్ మ్యాచ్‌ను అత్యంత వేగంగా ముగించేశాడు. ఒకే ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక లోయర్ ఆర్డర్‌ను దెబ్బతీసిన సుతార్, ఆ తర్వాత కేశర నువాంతను అవుట్ చేసి భారత్‌కు 165 పరుగుల ఘనవిజయాన్ని కట్టబెట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సుతార్ మ్యాచ్ వ్యాప్తంగా 10 వికెట్ల హాల్ సాధించడమే కాకుండా, టెస్టుల్లో శ్రీలంకపై ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.