రాజగోపాల్​ రెడ్డి చేరిక నాకు తెల్వదు

రాజగోపాల్​ రెడ్డి చేరిక నాకు తెల్వదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 సీట్లు గెలుస్తుందన్నారు. తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్న విషయం తనకు తెలియదన్నారు. అంతా హైకమాండ్ లీడర్లే చూసుకుంటున్నారని, ఆయన చేరికపై తనతో ఏ విషయమూ చెప్పలేదని తెలిపారు. 

ఒక్క రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదని, వేర్వేరు పార్టీలకు చెందిన చాలా మంది లీడర్లు కాంగ్రెస్​లో చేరుతున్నారన్నారు. బుధవారం జూబ్లీహిల్స్​లోని తన ఇంట్లో వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధిష్టానం తనను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలోకి దిగుతానన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలూ అమలవుతున్నాయని చెప్పారు. 

అభ్యర్థుల రెండో జాబితా గురువారం రిలీజ్ అవుతుందని, మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలకు నాలుగు సీట్లు ఇవ్వడమంటే మామూలు విషయం కాదని, వారికి అవేం తక్కువ కాదని చెప్పారు. మిర్యాలగూడ టికెట్ కూడా అడుగుతున్నారని, అక్కడ ఓటు ఎంత వరకు ట్రాన్స్​ఫర్ అవుతుందో చూడాల్సి ఉంటుందన్నారు.