తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగా కేసీఆర్ శైలి: లక్ష్మణ్

తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగా కేసీఆర్ శైలి: లక్ష్మణ్

తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేస్తుంటే...కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ కావాలనే ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్..రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా కేసీఆర్ శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులపై ప్రేమ ఒలకపోస్తున్న కేసీఆర్.. కొండా లక్ష్మణ్ బాపూజీని ఘోరంగా అవమానించారని  మండిపడ్డారు. మలి దశ ఉద్యమంలో ఢిల్లీలో దీక్ష చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీకి కనీసం మద్దతు తెలపలేదన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును తెలంగాణలో లేకుండా చేయాలని కేసీఆర్ చూశారని వెల్లడించారు.

బ్యానర్లతో ఏం సాధిస్తారు..?
రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా రాష్ట్రంలో రైతులకు, యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కానీ ప్రధాని పర్యటనను కేసీఆర్ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో రాజకీయంగా విభేదించినా...ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పారు. ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటే..తెలంగాణ అభివృద్ధి కోసం మోడీకి మరిన్ని వినతులు అడిగే అవకాశం లభిస్తుందన్నారు. అటు కేసీఆర్ కమ్యూనిస్టులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మోడీ రావద్దని బ్యానర్లను కట్టిస్తున్నారని ..దీని ద్వారా ఏం సాధిస్తారని ప్రశ్నించారు. చేనేత కార్మికుల పట్ల చిత్త శుద్ధి ఉంటే..రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జీఎస్టీని కార్మికులకే ఖర్చు చేయాలన్నారు. 40 లక్షల టర్నోవర్ కలిగిన చేనేత కార్మికులపై జీఎస్టీ విధించొద్దని కేంద్రం స్పష్టం చేస్తే..కేసీఆర్ మాత్రం..25 లక్షల టర్నోవల్ కలిగిన చేనేత కార్మికులపై ట్యాక్స్ వసూలు చేస్తున్నారి వెల్లడించారు. 


యువతకు ఉద్యోగ, ఉపాధి..
మోడీ ప్రధాని అయిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రాయితీ ఇస్తున్నారని చెప్పారు. గతంలో తెలంగాణలో ఎరువుల కోసం గతంలో రైతులు కొట్లాడారని గుర్తు చేశారు. లైన్లలో చెప్పులు పెట్టి మరీ ఎరువులు కొనుగోలు చేశారన్నారు. రైతులకు అలాంటి పరిస్ధితి రావద్దనే ఉద్దేశంతో కేంద్రం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని నిర్మించిందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా మనసు మార్చుకుని ప్రధాని పర్యటనలో పాల్గొనాలని సూచించారు.