‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఓవైపు సీతామహాలక్ష్మీగా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్గా తన నటనతో ఫిదా చేసిందామె. అందంతో పాటు ఆమె యాక్టింగ్ టాలెంట్ కూడా సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు తెలుగు ప్రేక్షకులు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తున్నా ఆచితూచి అంగీకరిస్తున్న ఆమె.. మనసుకు నచ్చిన పాత్రలతోనే ముందుకెళ్తానంటోంది. ఇప్పటికే తన చేతిలో నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘పూజా మేరీ జాన్’ కూడా ఒకటి. హూమా ఖురేషి, విజయ్ రాజ్, విక్రమ్ సింగ్ చౌహాన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నవజోత్ గులాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
‘సీతారామం’ తరహాలోనే ఇందులోనూ పూజగా టైటిల్ రోల్ పోషిస్తోందామె. అయితే సీత పాత్రకు పూర్తి భిన్నంగా ఇందులో కనిపిస్తానని, కాస్ట్యూమ్స్ మొదలు డైలాగ్ డెలివరీ వరకూ కొత్తగా ఉండబోతున్నాయని తన క్యారెక్టర్ గురించి రివీల్ చేసింది మృణాల్. మొత్తంగా తన నటనలో కొత్త కోణాన్ని చూస్తారని ఆమె చెబుతోంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం కోసమే తాను ఎప్పుడూ ఎదురుచూస్తానని, అలాంటి పాత్రలే వరుసగా వస్తుండడం సంతోషంగా ఉందని కూడా చెప్పింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. మరో మూడు హిందీ సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. తెలుగు సినిమాతో కెరీర్లో బిగ్ సక్సెస్ను అందుకున్న మృణాల్కు బాలీవుడ్లోనూ వరుస విజయాలు లభిస్తాయేమో చూడాలి!