
లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. అత్యంత ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో అతనికి చోటు దక్కింది. లార్డ్స్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను హాల్ ఆఫ్ ఫేమ్లో ధోనీని చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం అధికారికంగా ప్రకటించింది. 14 ఏండ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో ఆటగాడిగా, కెప్టెన్గా ధోనీ ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.
మూడు ఐసీసీ ట్రోఫీలను (వన్డే, టీ20 వరల్డ్ కప్స్, చాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన ఏకైక కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయాడు. మహీ కెప్టెన్సీలోని ఇండియా 2009లో తొలిసారిగా టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన ధోనీ మొత్తంగా 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచ్లు ఆడాడు. ముఖ్యంగా వన్డేల్లో 10,773 రన్స్తో ఎక్కువ సక్సెస్ సాధించాడు. వికెట్ కీపర్గా 829 డిస్మిసల్స్ చేశాడు.