ధోనికి సాక్షి సర్‌ప్రైజ్ గిఫ్ట్

ధోనికి సాక్షి సర్‌ప్రైజ్ గిఫ్ట్

టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి అతడి భార్య సాక్షి అద్భుతమైన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ ప్రస్తుతం కశ్మీర్‌లో భారత ఆర్మీతో పనిచేస్తున్నాడు. పారా రెజిమెంట్‌ బృందంతో కలిసి సైనిక విధుల్లో పాల్గొంటున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా తోటి సైనికులతో కలిసి వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ ఆటలు ఆడుతున్నాడు. ఆగస్టు 15వరకు అక్కడే ఉండే ధోనీ స్వాతంత్ర్య దినోత్సవం రోజు లేహ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో ధోనీ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆగస్టు 15వ తేదీ దాటిన తర్వాత ధోని ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ధోని భార్య సాక్షి ఒక గిఫ్ట్‌తో అతడిని సర్‌ప్రైజ్‌ చేసేందుకు సిద్ధమైంది. ధోనికి ఎంతో ఇష్టమైన ‘ జీప్‌ గ్రాండ్‌ చెరోకీ’ అనే అద్భుతమైన కారును కొన్న సాక్షి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

“నీ కోసం సరికొత్త టాయ్‌ ఎదురు చూస్తోంది. త్వరలో ఇంటికి రాబోతున్న నీకు వెల్‌కమ్‌. నీకిష్టమైన రెడ్‌ బీస్ట్‌ ఇంటికొచ్చింది. నిన్న నేను చాలా మిస్సవుతున్నా. ఇండియాలోనే ఇది తొలి కారు” అంటూ సాక్షి కామెంట్ పోస్టు చేసింది. ధోనికి కార్లన్నా, బైకులన్నా ఎంతో ఇష్టం.