- 95 శాతం పనులు కంప్లీట్ చేశాం
- ఈ నెల 13 నుంచి వన్ వే అమలు
- ములుగులో ఐసోలేషన్ సెంటర్
- అమ్మవార్లను గద్దెలపైకి
- కరెక్ట్ టైమ్కు తీసుకొస్తాం
- క్వాలిటీగా పనులు చేసిన కాంట్రాక్టర్లకే బిల్లులు
- జాతర అయిపోయాక చిలుకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్
- ‘వెలుగు’ ఇంటర్వ్యూలో ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య
జాతర ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి?
కలెక్టర్: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో జరుగుతున్న ఈ జాతరను ప్రభుత్వం చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంది. మేడారం ప్రాంతాన్ని 8 జోన్లు, 35 సెక్టార్లుగా డివైడ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్లకు బాధ్యతలిచ్చాం. జాతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు ఇవ్వగా ఇప్పటికే 95 శాతం పనులు కంప్లీట్ చేశాం. మిగిలినవి రెండు రోజుల్లో పూర్తి చేస్తాం.
కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
కలెక్టర్: రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. వైరస్ సోకినా పెద్దగా ప్రభావం చూపట్లేదు. కేవలం ఐదు రోజులు ఐసొలేషన్లో ఉంటే సరిపోతుంది. జాతరలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్తరపున మేడారం చుట్టుపక్కల కోర్ ఏరియాలో 35 హెల్త్క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. లక్ష కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉండగా, మరో 4 లక్షలు తెప్పిస్తున్నాం. జాతరలో 50 లక్షల మాస్కులు పంపిణీ చేస్తాం. ములుగులో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. 15 అంబులెన్స్లను రెడీగా ఉంచాం. గవర్నమెంట్ నుంచి 57 మంది , ఇతర సొసైటీల నుంచి 15 మంది కలిపి మొత్తం 72 మంది డాక్టర్లకు జాతర డ్యూటీలు ఇచ్చాం. వీరితో పాటు మరో వెయ్యి మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు.
గత జాతరలో అమ్మవార్లను గద్దెలకు ఆలస్యంగా చేర్చారు..ఈసారి ఇది రిపీట్ కాకుండా ఏం చేయబోతున్నారు?
కలెక్టర్: 2020 మహా జాతరలో సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెలపైకి ఆలస్యంగా తీసుకువచ్చింది నిజమే. కో ఆర్డినేషన్ లేకపోవడం వల్ల అలా జరిగింది. ఈ సారి అలా కాకుండా గిరిజన పూజారులతో సమన్వయం చేసుకోవడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ను నియమించాం. జాతర ప్రారంభం నాటికే ఆ ఆఫీసర్ పూజారులందరితో మాట్లాడతారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా అమ్మవార్లను, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెలకు తీసుకువస్తాం.
చిలుకల గుట్ట ఫెన్సింగ్ కూలిపోయి చాలా రోజులవుతోంది. ఎవరు పడితే వాళ్లు గుట్టెక్కుతున్నారు. అయినా ఎందుకు పట్టించుకోవడం లేదు ?
కలెక్టర్: చిలుకల గుట్టపై సమ్మక్క తల్లి ఉంటుందని అందరూ నమ్ముతారు. గతంలో చిలుకలగుట్ట చుట్టూ కొంత భాగం ఫెన్సింగ్ వేశారు. ఈ మధ్య భారీ వర్షాలకు కొన్ని చోట్ల ఫెన్సింగ్ కూలిపోయింది. గుట్ట చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేయడానికి ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. జాతర మరీ దగ్గర్లో ఉన్న కారణంగా పనులు స్టార్ట్ చేయలేదు. జాతర అయిపోయిన వెంటనే చిలుకల గుట్ట రక్షణ కోసం ఫెన్సింగ్ పనులు మొదలుపెడతాం.
జాతర పనులను ఇంజినీరింగ్ శాఖలు హడావిడిగా, క్వాలిటీ లేకుండా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి? దీనికి ఏమంటారు?
కలెక్టర్: ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఐబీ, ఐటీడీఏ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ల ద్వారానే జాతర పనులు చేస్తున్నాం. ఈ సారి ఎక్కువగా పర్మినెంట్కన్స్ట్రక్షన్స్కు ప్రయారిటీ ఇచ్చాం. హడావిడిగా పనులు చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఎంక్వైరీ చేస్తాం. క్వాలిటీతో పనులు చేసిన వారికి మాత్రమే బిల్లులిస్తాం. సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చిన తర్వాత ఒక్క రోజులోనే జాతర ప్రాంతం చెత్తగా మారుతోంది. చాలామంది పబ్లిక్గానే లాట్రిన్, యూరిన్ పోతున్నారు. దీనివల్ల భక్తుల హెల్త్ ఖరాబవుతోంది.
ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు?
కలెక్టర్: అవును మీరన్నది నిజమే. ఈ సారి అలా జరగకుండా చూస్తాం. ఆర్డబ్ల్యూఎస్ తరపున 320 ప్లేసుల్లో 6,400 టెంపరరీ టాయిలెట్స్నిర్మించాం. వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించాం. 15 సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లను అందుబాటులో ఉంచాం. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 4 వేల మంది వర్కర్లకు మూడు షిప్టుల్లో డ్యూటీలు వేశాం. ఈసారి జాతర కోర్ ఏరియాలో ఎక్కడ కూడా పబ్లిక్గా లాట్రిన్ కు గాని, యూరిన్కు గాని వెళ్లకుండా అడ్డుకుంటాం.
వన్వే రూల్స్ ఎప్పటి నుంచి అమలవుతాయి. ఏమైనా రూల్స్ మార్చారా?
కలెక్టర్: రూల్స్ ఏమీ మారలేదు. గత జాతర టైంలో తీసుకున్న వన్వే రూల్స్ యాజ్ ఇట్ఈజ్గా అమలు చేస్తున్నాం. ఇప్పటికే ప్రైవేట్, వీఐపీ, వీవీఐపీ వెహికిల్స్, ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్లను రెడీ చేశాం. రోడ్ల రిపేర్లు కంప్లీట్ చేశాం. ఈ నెల 13 నుంచి వన్ వే రూల్స్ అమల్లోకి వస్తాయి.
జాతరలో ట్రాఫిక్ కష్టాలకు చెక్పెట్టడానికి ఏం చేస్తున్నారు?
కలెక్టర్: ఈసారి ట్రాఫిక్ ఇన్చార్జీగా వరంగల్ సీపీ తరుణ్ జోషి బాధ్యతలు తీసుకున్నారు. జనగామ జిల్లా పెంబర్తి నుంచి మేడారం వరకు సుమారు 10,300 మంది పోలీసులు డ్యూటీలు చేస్తారు.
జాతర డ్యూటీలు చేసే ఉద్యోగులకు ఏం ఫెసిలిటీస్కల్పించారు?
కలెక్టర్: ప్రభుత్వ శాఖల తరపున 20 వేల మందికి పైగా ఉద్యోగులు డ్యూటీ చేయనున్నారు. ఏయే శాఖల వాళ్లకు ఆయా శాఖల ద్వారా లంచ్, డిన్నర్,వసతి కోసం ఫండ్స్ఇచ్చాం. ఒక రోజు 8 గంటలు మాత్రమే డ్యూటీ చేసేలా చర్యలు తీసుకున్నాం. వారికి ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తా.
మేడారం జాతర ఈ నెల16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. తెలంగాణ కుంభమేళాగా పిలిచే వనదేవతల జాతరకు దేశం నలుమూలల నుంచి కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అన్ని శాఖల ఆఫీసర్లు రెడీగా ఉన్నారన్నారు. మేడారం వచ్చే భక్తులకు కరోనా భయం అవసరం లేదని, జాతర కోర్ ఏరియాలో 35 హెల్త్క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 13 నుంచి వన్వే అమలు చేస్తామని తెలిపారు. మేడారం ఏర్పాట్లపై సోమవారం 'వెలుగు' ప్రతినిధికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
- జయశంకర్ భూపాలపల్లి, వెలుగు