
తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కు మోపుతోంది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే అక్కడి వాలిపోయి.. అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రజల్లో చైతన్యం వస్తుండడంతో అవినీతికి అలవాటు పడ్డ ఆఫీసర్ల పని పట్టేందుకు పలువురు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఏసీబీ ఆఫీసర్లు సైతం మెరుపు దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల ఆటకట్టిస్తున్నారు
ALSO READ | ఆ నమ్మకాన్ని కల్గించారు.. కరీంనగర్ కలెక్టర్పై సీఎం రేవంత్ ప్రశంసలు
జూన్ 16న లంచం తీసుకుంటుండగా ములుగు జిల్లా డీఈవో, జూనియర్ అసిస్టెంట్ ను అడ్డంగా పట్టుకుంది ఏసీబీ. సిక్ లీవ్ నుంచి రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయునికి పోస్టింగ్ ఇచ్చేందుకు 20వేల లంచం డిమాండ్ చేశారు డీఈవో,జూనియర్ అసిస్టెంట్. దీంతో బాధిత ఉపాధ్యాయుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ ఉపాధ్యాయుడి నుంచి డీఈవో ఫణిని రూ. 15000, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. డీఈవో ఫణిని, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ ను అరెస్ట్ చేశారు అధికారులు. డీఈవో కార్యాలయంలో అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.
పని కావాలంటే చేయి తడపాల్సిందే..!
భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, పూర్తయిన పనులకు బిల్లులు మంజూరు చేయాలన్నా, ఇతర పనులకు విరివిగా లంచాలను డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, వైద్య, విద్య, లేబర్, రవాణా, ఇరిగేషన్, దేవాదాయం ఇలా పలు శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులు పట్టుబడ్డారు. మరికొన్ని శాఖల్లో ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు మధ్యవర్తులను నియమించుకుని మరీ లంచం పుచ్చుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకంగా చేయాల్సిన పనికి ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా ఏసీబీకి సమాచారం ఇవ్వండి.