ఆ నమ్మకాన్ని కల్గించారు.. కరీంనగర్ కలెక్టర్పై సీఎం రేవంత్ ప్రశంసలు

ఆ నమ్మకాన్ని కల్గించారు.. కరీంనగర్ కలెక్టర్పై సీఎం రేవంత్ ప్రశంసలు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై  నమ్మకాన్ని కల్గించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఆధునిక సదుపాయాలు,  అనుభవం ఉన్న వైద్యులు,  సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు. సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలి.  ప్రభుత్వ ఆసుపత్రిలో  శస్త్ర చికిత్స చేయించుకుని ఆ నమ్మకాన్ని కలిగించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్  పమేలా సత్పతికి నా అభినందనలు. అని సీఎం రేవంత్ తెలిపారు.

ALSO READ | సీఎం రేవంత్ .. మంత్రి పొన్నం చిత్రపటాలకు ఆటో సంఘం పాలాభిషేకం

శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న కరీంనగర్‌‌ కలెక్టర్‌‌ పమేలా సత్పతి జూన్ 15న  స్థానిక గవర్నమెంట్‌‌ హాస్పిటల్‌‌లో సర్జరీ చేయించుకున్నారు. ఈఎన్‌‌టీ సర్జన్ల ఆధ్వర్యంలో కలెక్టర్‌‌కు ఎండోస్కోపీ నేసల్‌‌ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీ జరిగింది.  కలెక్టర్‌‌ పమేలా సత్పతి కొన్నేళ్లుగా తలనొప్పి, ముక్కు దిబ్బడ, నాసిక అడ్డంకి, సైనసైటిస్‌‌తో పాటు శ్వాస ఇబ్బందితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఈఎన్‌‌టీ స్పెషలిస్ట్‌‌ను కలిసి మెడిసిన్స్‌‌ వాడుతున్నారు. 

కానీ సమస్య తగ్గకపోవడంతో సర్జరీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం కరీంనగర్‌‌ గవర్నమెంట్‌‌ జనరల్ హాస్పిటల్‌‌లో ఈఎన్‌‌టీ సర్జన్లు ఎల్‌‌.రవికాంత్, సందీప్, మధుమిత ఆధ్వర్యంలో కలెక్టర్‌‌కు ఎండోస్కోపీ నేసల్‌‌ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీ చేసినట్లు జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ జి.వీరారెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు సర్కార్‌‌ హాస్పిటల్స్‌‌లో ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యుల డెలివరీలు మాత్రమే జరిగాయని, మొదటిసారిగా కరీంనగర్‌‌ కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ హాస్పిటల్‌‌లో సర్జరీ చేయించుకున్నారని ఆయన తెలిపారు.