ముడుపులు తీసుకుని ఇండ్ల కేటాయింపు..    మహిళ రాసిన లేఖను పిల్‌‌‌‌గా స్వీకరించిన హైకోర్టు

ముడుపులు తీసుకుని ఇండ్ల కేటాయింపు..    మహిళ రాసిన లేఖను పిల్‌‌‌‌గా స్వీకరించిన హైకోర్టు
  • వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ములుగులో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే పిటిషన్‌‌‌‌ను హైకోర్టు విచారించింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇండ్ల కేటాయింపులో ప్రజల నుంచి ముడుపులు స్వీకరించారనే అభియోగాల కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి, కలెక్టర్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, సీబీఐతో విచారణ జరిపించాలని వెంకటాపురం గ్రామానికి చెందిన వితంతువు తిప్పల సాయిభవాని హైకోర్టుకు లేఖ రాసింది. ఇల్లు కేటాయించాలన్న వినతిని అధికారులు పరిశీలించలేదని, ప్రజల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసి ఇండ్లు కేటాయించారని పేర్కొంది. 

ఆ డబ్బుతో అధికారులు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని ఆమె రాసిన లేఖను హైకోర్టు పిల్‌‌‌‌గా స్వీకరించింది. దీన్ని జస్టిస్‌‌‌‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌‌‌‌ నందికొండ నర్సింగ్‌‌‌‌రావుతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ శుక్రవారం విచారించింది. అనంతరం విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.