కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ఎంతో ఉత్సహంగా పాల్గొంటున్నారు. రాహుల్ తో కలిసి ఆడుగులో ఆడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న జోడో యాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి కాసేపు ముచ్చటించారు. జోడో యాత్రకు వస్తోన్న స్పందన భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతమని ఆమె పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర గురువారం 15వ రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పారంబయం జుమా మసీదు నుంచి 15వ రోజు పాదయాత్రను మొదలుపెట్టారు. 1925లో అలువాలోని యూసీ కాలేజీలో మహాత్మాగాంధీ (బాపు) నాటిన మామిడి చెట్టుకు రాహుల్ గాంధీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్షద్వీప్ నుంచి వచ్చిన కార్యకర్తలు తీసుకొచ్చిన మొక్కను రాహుల్ గాంధీ నాటారు.
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం150 రోజుల్లో పూర్తవనుంది. ఈ పాదయాత్ర 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. సెప్టెంబర్ 30న కర్నాటకలో భారత్ జోడో యాత్ర ఎంటర్ కానుంది.