ముంబై: భారీ వర్షాల ధాటికి ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘట్కోపర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం వేకువజామున ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు.
చిరాగ్ నగర్లోని అశోక్ నగర్, గౌసియా చావ్ల్ వద్ద బుధవారం వేకువజామున కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. కొండ పైనుంచి భారీగా మట్టి, రాళ్ల వ్యర్థాలు రెండు- మూడు ఇండ్లపై పడ్డాయని చెప్పారు. దీంతో రెండేండ్ల పసికందు సహా ముగ్గురు చిన్నారులు.. మొత్తం ఏడుగురు మరణించారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్కు చేరుకున్నారు.
క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. ప్రమాద స్థలానికి వెళ్లే మార్గం అత్యంత ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
