ముంబై గెలిచిందోచ్‌‌‌‌‌‌‌‌.. 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై విక్టరీ

ముంబై గెలిచిందోచ్‌‌‌‌‌‌‌‌.. 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై విక్టరీ

న్యూఢిల్లీ: పాయింట్ల పట్టికలో చివరి రెండు ప్లేస్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్న జట్ల మధ్య ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ విజయం సాధించింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ (45 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 65), హైదరాబాదీ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 41) రెచ్చిపోవడంతో మంగళవారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌పై నెగ్గింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఢిల్లీ తొలుత19.4 ఓవర్లలో 172 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (25 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 54), కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌ (47 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లతో 51) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు సాధించారు. తర్వాత ముంబై 20 ఓవర్లలో 173/4 స్కోరు చేసింది. రోహిత్​కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

ఇద్దరు మాత్రమే..

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌ ఇంకా గాడిలో పడలేదు. ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో వార్నర్‌‌‌‌‌‌‌‌ స్థిరంగా ఆడినా... పృథ్వీ షా (15)  నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే వికెట్‌‌‌‌‌‌‌‌ పారేసుకున్నాడు. దీంతో 33/1 స్కోరుతో కష్టాల్లో పడిన డీసీని మనీష్‌‌‌‌‌‌‌‌ పాండే (26) ఆదుకునేందుకు ప్రయత్నించాడు. వార్నర్‌‌‌‌‌‌‌‌తో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి ఔటయ్యాడు. దీంతో 9 ఓవర్లలో 76/2తో మెరుగ్గా కనిపించిన ఢిల్లీని మధ్యలో చావ్లా (3/22), బెరెన్‌‌‌‌‌‌‌‌డార్ఫ్‌‌‌‌‌‌‌‌ (3/23), మెరిడిత్‌‌‌‌‌‌‌‌ (2/34) దెబ్బ కొట్టారు. యష్‌‌‌‌‌‌‌‌ ధూల్‌‌‌‌‌‌‌‌(2), పావెల్‌‌‌‌‌‌‌‌(4), లలిత్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (2)ను సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేయడంతో స్కోరు 98/5గా మారింది. ఈ దశలో వార్నర్‌‌‌‌‌‌‌‌తో కలిసి అక్షర్‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించాడు. ఈ ఇద్దరు భారీ సిక్సర్లతో రెచ్చిపోయారు. అయితే  చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ తడబడింది.19వ ఓవర్లో బెరెన్‌‌‌‌‌‌‌‌డార్ఫ్‌‌‌‌‌‌‌‌ నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో అక్షర్‌‌‌‌‌‌‌‌, వార్నర్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌ పోరెల్‌‌‌‌‌‌‌‌ (1)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేయగా కుల్దీప్‌‌‌‌‌‌‌‌ (0) రనౌటయ్యాడు. చివరి ఓవర్లో ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టిన అన్రిచ్‌‌‌‌‌‌‌‌ (5) ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కు వెనుదిరగడంతో ఢిల్లీ పూర్తి ఓవర్లు ఆడలేదు.

రోహిత్‌‌‌‌‌‌‌‌ ముందుండి..

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ ముంబై ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను  ముందుండి నడిపించాడు. గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఓటమి నేపథ్యంలో  ఈసారి స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే జట్టు బాధ్యత తీసుకున్నాడు. హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ 4, 6, 4తో తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెడితే. రెండో ఓవర్లో షాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ (31) హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ ఫోర్లు బాదాడు. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ 6, 4, ఇషాన్‌‌‌‌‌‌‌‌ 4, 4 కొట్టాడు. వీళ్ల జోరుకు  పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో ముంబై 68/0తో నిలిచింది. కానీ 8వ ఓవర్లో రోహిత్​ తప్పిదంతో ఇషాన్‌‌‌‌‌‌‌‌ రనౌట్‌‌‌‌‌‌‌‌కావడంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 71 పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ అండతో  రోహిత్‌‌‌‌‌‌‌‌ సిక్సర్ల జోరు తగ్గనీయలేదు. అదే జోరుతో 2021 తర్వాత రోహిత్‌‌‌‌‌‌‌‌ తొలి హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌) సాధించాడు.  12వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో తిలక్‌‌‌‌‌‌‌‌ జోరందుకున్నాడు. స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేస్తూనే భారీ షాట్లు కొట్టాడు. ముకేశ్‌‌‌‌‌‌‌‌ (2/30) వేసిన16వ ఓవర్లో 4, 6, 6తో చెలరేగిన అతను  ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కు ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 68 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఆరో బాల్‌‌‌‌‌‌‌‌కు సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ (0) డకౌటయ్యాడు. ఆ వెంటనే రోహిత్‌‌‌‌‌‌‌‌ కూడా వెనుదిరగడంతో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ తడబడింది. చివర్లో టిమ్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌ (13 నాటౌట్‌‌‌‌‌‌‌‌), గ్రీన్‌‌‌‌‌‌‌‌ (17 నాటౌట్‌‌‌‌‌‌‌‌) చెరో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టారు. ఆఖరి ఓవర్‌‌‌‌‌‌‌‌లో 5 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం కాగా, డేవిడ్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ను ముకేశ్‌‌‌‌‌‌‌‌ మిస్‌‌‌‌‌‌‌‌ చేశాడు. తొలి ఐదు బాల్స్​కు మూడే రన్స్​ రావడంతో టెన్షన్​ పెరిగింది.  లాస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు రెండు రన్స్​ అవసరం కాగా.. డేవిడ్​ డైవ్​ చేస్తూ  డబుల్​ తీసి ముంబైని గెలిపించాడు. 

సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 19.4 ఓవర్లలో 172 (అక్షర్‌‌‌‌‌‌‌‌ 54, వార్నర్‌‌‌‌‌‌‌‌ 51, బెరెన్‌‌‌‌‌‌‌‌డార్ఫ్‌‌‌‌‌‌‌‌ 3/23, పీయూష్‌‌‌‌‌‌‌‌ చావ్లా 3/22), ముంబై: 20 ఓవర్లలో 173/4 (రోహిత్‌‌‌‌‌‌‌‌ 65, తిలక్‌‌‌‌‌‌‌‌ 41, ముకేశ్‌‌‌‌‌‌‌‌ 2/30)