
ఐపీఎల్ 2023లో మరో కీలక పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఫైట్ కు అంతా సిద్ధమైంది. ఈ సీజన్ లో రెండు జట్లు ఇప్పటి వరకు బోణి కొట్టలేదు. ఢిల్లీ ఆడిన మూడు మూడింట ఓడింది.అదే సమయంలో ముంబై కూడా ఒక్క మ్యాచులోనూ గెలవలేదు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. దీంతో రెండు జట్లు ఎలాగైనా ఈ మ్యాచులో గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.
పేలవమైన ఆటతీరు..
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో పేలవంగా ఆడుతోంది. ముఖ్యంగా బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతోంది. ఢిల్లీ జట్టులో కీలక ప్లేయర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లడంతో మరింత బలహీనంగా తయారైంది. మార్ష్ లేకపోవడంతో అతని స్థానంలో రైలీ రూసో, మనీష్ పాండేను జట్టులోకి తీసుకుంది. కానీ వాళ్లిద్దరూ చివరి మ్యాచ్లో విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్లో వీరిద్దరికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పృథ్వీ షా కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. అయితే చివరి సారిగా అతనికి ఈ మ్యాచులో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ లోనే కాదు ఢిల్లీ బౌలింగ్ లోనూ బలహీనంగా కనిపిస్తోంది. పేస్, స్పిన్ విభాగంలో రాణించాల్సి ఉంది. మరోవైపు కీలక బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ మ్యాచుకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఖలీల్ స్థానంలో చేతన్ సకారియాను ఆడించే ఛాన్సుంది.
ముంబై పర్లేదు..
మరోవైపు రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ ఢిల్లీతో పోల్చుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ లో ఫర్వాలేదనిపిస్తోంది. అయితే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ల ఫామ్ లేమి ముంబైని ఇబ్బంది పెడుతోంది, వీరిద్దరు రాణిస్తే ముంబైను ఆపడం కష్టమే. వీరికి తోడు ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్ చెలరేగితే ఢిల్లీకి కష్టాలు తప్పవు. మరోవైపు ఈ మ్యాచులో ముంబై తరపున పేసర్ ఆర్చర్ బరిలోకి దిగబోతున్నాడు. భుజం నొప్పితో విశ్రాంతి తీసుకున్న ఆర్చర్..కోలుకొని ఢిల్లీతో ఆడేందుకు రెడీగా ఉన్నాడు. ఇతనికి తోడు హృతిక్ షోకీన్కు మరో అవకాశం ఇవ్వాలని ముంబై భావిస్తోంది.
పిచ్ రిపోర్టు..
అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్ ఛేజింగ్ కు ఉపయోపడనుంది. ఈ వేదికపై 78 ఐపీఎల్ మ్యాచులు ఆడితే అందులో 43 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. 35 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. 2019 నుండి ఇక్కడ 31 టీ20 మ్యాచులు జరిగాయి. ఇందులో 23 సార్లు ఛేజింగ్ జట్టు గెలిచింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన 6 సార్లు విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచులో టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
వాతావరణం ఎలా ఉంటుంది..
ఢిల్లీ, ముంబై మ్యాచుకు వర్షం ఎలాంటి ఆటంకం కలిగించదు. మ్యాచ్ సమయంలో ఢిల్లీలో వాతావరణం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం పడే ఛాన్స్ లేదని పేర్కొంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. దీంతో 40 ఓవర్ల పాటు మ్యాచ్ జరుగుతుందని..ప్రేక్షకులు గేమ్ను ఎంజాయ్ చేయొచ్చని వెల్లడించింది.
ఈ మ్యాచులో బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ వార్నర్ వార్నర్ అయ్యే అవకాశం ఉంది. అతను ఈ సీజన్లో ఢిల్లీ తరపున అత్యధిక పరుగులు సాధించాడు. దీంతో మరోసారి వార్నర్ చెలరేగే ఛాన్సుంది. ఈ మ్యాచులో బెస్ట్ బౌలర్ అక్షర్ పటేల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అతను రెండు సార్లు రోహిత్ శర్మ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచులో మిడిల్ ఓవర్లలో పటేల్ కీలకంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు..ఆటగాళ్ల ఫామ్...గణాంకాలు బట్టి చూస్తే ముంబైకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.