ముంబైలో మందు షాపులు బంద్‌

ముంబైలో మందు షాపులు బంద్‌
  • ఉత్తర్వులు జారీ చేసిన బీఎంసీ

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి లిక్కర్‌‌ షాపులను బంద్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనం లిక్కర్‌‌ కోసం భారీగా బయటకు రావడంతో సోషల్‌ డిస్టెంసింగ్‌ దెబ్బతింతోందని, వైరస్‌ అధికంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్పారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఎషెన్షియల్‌ సర్వీసెస్‌ మాత్రమే తెరిచి ఉంచాలని అన్నారు. కరోనాను అరికట్టేందకు లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 వరకు దాన్ని పొడిగించింది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు మాత్రం పర్మిషన్‌ ఇవ్వడంతో వైన్స్‌ దగ్గర మందు బాబులు క్యూ కట్టారు. కాగా.. ఈ నెల 17 వరకు ముంబైలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. వైద్యం కోసం తప్ప ఇతర పనుల కోసం బయటకు వస్తే ఆరు నెలల పాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో కేవలం ముంబైలోనే ఇప్పటి వరకు దాదాపు 1000 కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.