ముంబైలో డబ్బావాలాలు, విదేశీ కౌన్సులేట్లలో పనిచేసే సిబ్బందికి లోకల్ ట్రైన్లలో తిరిగే అనుమతి ఇచ్చారు. ప్రస్తుతానికి లోకల్ టైన్స్ను కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే వినియోగిస్తున్నారు. లంచ్ బాక్సులు తీసుకువెళ్లే డబ్బావాలాలు ముంబైలో చాలా ఫేమస్ . వారు ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. 130 ఏళ్ల నుంచి టిఫిన్ సర్వీసులు అక్కడ కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా ఆ డబ్బావాలాల సేవలు ఆరు నెలలుగా నిలిచిపోయాయి. అయితే పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు లోకల్ రైళ్లలో తిరిగే అనుమతి ఇవ్వాలని డబ్బావాలాలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కోవిడ్ నిబంధనల క్రమంలో కేవలం సైకిళ్ల మీద దక్షిణ ముంబై ప్రాంతానికి చేరుకునే డబ్బావాలాలకు అనుమతి ఇచ్చారు.
ఇప్పుడు లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతి రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో సుమారు 5 వేల మంది డబ్బావాలాలు టిఫిన్ బాక్సుల డెలివరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి ఆఫీస్కు వెళ్లి సకాలంలో వారి ఇంటి నుంచి తెచ్చే భోజనం అందిస్తారు.