అమ్మ బంగారం ధరించడం నేనెప్పుడూ చూడలేదు

అమ్మ బంగారం ధరించడం నేనెప్పుడూ చూడలేదు

ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ 100వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మోడీ గుజరాత్ లోని  గాంధీనగర్ లో తల్లి  దగ్గరకు వెళ్లి  శుభాకాంక్షలు తెలిపారు. తల్లిపేరుతో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని.. ఆమె కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. పాదాభివందనం చేసి, పూలమాల వేశారు. ఆ తర్వాత అమ్మతో కలిసి భోజనం చేసిన మోడీ.. చాలాసేపు సంతోషంగా గడిపారు. తల్లిపై ఉన్న ప్రేమను వ్వక్తపరుస్తూ మోడీ ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. తల్లితో గడిపిన జీవితాన్ని స్మరించుకుంటూ మోడీ బ్లాగ్‌ను రాశారు.‘మాథిస్ అనేది పదం కాదు, అది ఎన్నో రకాల భావోద్వేగాలను అందిస్తోంది. ఈ రోజు జూన్ 18 న తల్లి హీరాబా 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు. ఈ పుట్టిన రోజున నేను సంతోషంతో తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని ఆలోచనలు రాశాను’ అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. 

తల్లి హీరాబెన్‌ను అసాధారణమైన మహిళగా అభివర్ణించిన  మోడీ

‘నా తల్లి చిన్నతనంలోనే ఆమె తల్లిని కోల్పోయిందని, జీవితంలో ఎన్నో కష్టాలను భరించిందని, అయితే దాని కోసం మరింత దృఢంగా ఎదిగింది’’అని మోడీ తన బ్లాగ్‌లో రాశారు. పెరిగేకొద్దీ తన తల్లి చేసిన అనేక త్యాగాలను గుర్తుచేసుకున్నారు. తల్లి మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాస లక్షణాలను గురించి ప్రధాని ప్రస్తావించారు. తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి నివాసం ఉన్న వాద్‌నగర్‌లోని మట్టి గోడలు, మట్టి పలకలతో కూడిన పైకప్పుతో ఉన్న చిన్న ఇంటిని మోడీ గుర్తుచేసుకున్నారు. ‘నా తల్లి ఇంటి పనులన్నీ స్వయంగా చేయడమే కాకుండా, ఇంట్లో వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి కూడా ఆమె పనిచేసింది. ఆమె కొన్ని ఇళ్లలో పాత్రలు కడగడమే కాకుండా ఇంటి ఖర్చుల కోసం చరఖాను తిప్పడానికి సమయాన్ని వెచ్చించేది’అన్నారు. ‘వర్షాల సమయంలో మా ఇంటి పైకప్పు లీక్ అవుతుండేది, ఇంట్లో వర్షపు నీటిని సేకరించేందుకు తల్లి లీకేజీల కింద బకెట్లు,పాత్రలను ఉంచేది. అధికారికంగా చదువుకోకుండానే నేర్చుకోవడం సాధ్యమవుతుందని తన తల్లి తనకు అర్థమయ్యేలా చేసింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ తల్లి దృఢత్వానికి ప్రతీకగా నిలుస్తుంది’ అని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.  

తన తల్లి  అత్యంత సాధారణ జీవనశైలిని ప్రతిబింబిస్తుందని,  నేటికీ తన తల్లి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని పీఎం మోడీ రాశారు. ‘‘ఆమె బంగారు ఆభరణాలు ధరించడం నేను ఎప్పుడూ చూడలేదు, ఆమెకు ఆభరణాల పట్ల ఆసక్తి కూడా లేదు. మునుపటిలాగే, ఆమె తన చిన్న గదిలో చాలా సాధారణ జీవనశైలిని కొనసాగిస్తుంది’’అని మోడీ వివరించారు.  తన బ్లాగ్ పోస్ట్‌లో పీఎం మోడీ తన తల్లి బహిరంగంగా తనతో కలిసి వచ్చిన రెండు సందర్భాలను మాత్రమే హైలైట్ చేశారు. ఒకసారి అహ్మదాబాద్‌లోని ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో ఏక్తా యాత్రను ముగించి లాల్ చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేసి శ్రీనగర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన నుదిటిపై తిలకం దిద్దింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ తొలిసారి ప్రమాణం చేయడం రెండవ ఉదాహరణ అని మోడీ వివరించారు.  హీరాబెన్  జూన్--18-, 1923న జన్మించారు.