ఓల్డ్సిటీ, వెలుగు: మైలార్దేవ్పల్లిలో వరుస హత్యలు స్థానికులను కలకలం రేపుతున్నాయి. బుధవారం నడిరోడ్డుపై మహమ్మద్ ఖాజీ సోహెల్ దారుణ హత్యకు గురికాగా.. ఆ ఘటన మరువక ముందే గురువారం మరో హత్య జరిగింది. పోలీసులు, మృతుడి భార్య సయ్యదా యూసుఫున్నీసా తెలిపిన వివరాల ప్రకారం..
బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అబ్దుల్ రవూఫ్ ఇంటి నుంచి ఆటో నడిపేందుకు బయలుదేరాడు. సాయంత్రం 4 గంటలకు భార్య ఫోన్ చేయగా రాత్రి భోజనానికి నేరుగా ఇంటికి వస్తానని చెప్పాడు. గురువారం తెల్లవారుజామున అలీనగర్ వద్ద జావీద్, అతడి సహచరులు రవూఫ్పై కత్తులతో నరికి చంపేశారు. గతంలో జావీద్ సోదరుడు సాజిద్ మృతి చెందగా.. ఆ ఘటనకు రవూఫ్ కారణమని జావీద్ అనుమానిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత కక్షలతోనే రవూఫ్ను హత్య చేసినట్లు తెలిసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
