V6 News

నాంపల్లిలో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

నాంపల్లిలో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా మిగతా  రాష్ట్రాల నుంచి జనం ఇప్పటికే సిటీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు విరామం లేకుండా చేపమందు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో రెండ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు వెహికల్స్ డైవర్షన్ ఉంటుందన్నారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చేప ప్రసాదానికి వచ్చేవారి వెహికల్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.

డైవర్షన్స్​ ఇలా..

    ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వెహికల్స్​ను అబిడ్స్ జీపీవో, నాంపల్లి స్టేషన్​మీదుగా దారి మళ్లిస్తారు.
    బేగంబజార్‌ ఛత్రి‌, ఎంజే బ్రిడ్జి నుంచి నాంపల్లి వైపు వచ్చే వెహికల్స్​ను దారుసలాం, ఏక్ మినార్ వైపు దారి మళ్లిస్తారు.
    అసెంబ్లీ జంక్షన్‌ నుంచి నాంపల్లి స్టేషన్‌, అఫ్జల్‌గంజ్ వైపు వచ్చే వెహికల్స్ ను బషీర్​బాగ్​ఏఆర్ పెట్రోల్​పంప్, బీజేఆర్ విగ్రహం మీదుగా పంపిస్తారు.

పార్కింగ్‌ ఏరియాలు

    చేప ప్రసాదం కోసం వచ్చే వారి వెహికల్స్​ను నాంపల్లిలోని గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్, ఎంఏఎం గర్ల్స్ జూనియర్ కాలేజీ, ఇంటర్ బోర్డు వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్​ ప్లేస్​లో పార్క్ చేయాల్సి ఉంటుంది.  

    బస్సులు, వ్యాన్లను గోషామహల్‌ పోలీస్ స్టేడియంలో పార్క్‌ చేయాలి.
    ప్రభుత్వ వెహికల్స్, బైక్​లను భీమ్ నగర్, గృహకల్ప, బీజేపీ ఆఫీస్‌ వద్ద పార్క్ చేయాలి. 
    పాస్‌లు ఉన్న వీఐపీ కార్లను సీడబ్ల్యూసీ గోడౌన్స్ పార్కింగ్‌ ఏరియాలో పార్క్ చేయాలి.