వారి సినిమాలు చూడకండి.. నరకం చూపించండి

వారి సినిమాలు చూడకండి.. నరకం చూపించండి

బాలీవుడ్ లో అప్పట్లో మీ టూ ఉద్యమం నేపథ్యంలో వార్తల్లో బాగా వినిపించిన పేరు తను శ్రీ దత్తా. ఆమె గొంతు విప్పిన తర్వాత ఇండస్ట్రీలోని పలువురు నటీమణులు సైతం తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటపెట్టారు. ప్రముఖ నటుడు నానా పాటేర్ తనను తీవ్రంగా వేధించారని గతంలో ఆమె ఆరోపణలు కూడా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తనకు సినిమా అవకాశాలు కూడా రాకుండా వేధిస్తున్నారని ఇప్పటికే పలుసార్లు తను శ్రీ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. కాగా తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. 

తనకు ఏదైనా జరిగితే మీ టూ నిందితుడు నానా పటేకర్, అతని బాలీవుడ్ మాఫియా స్నేహితులే కారణమవుతారని శ్రీ దత్తా పోస్ట్ చేసింది. అదెవరా అని అనుకుంటున్నారా ? సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన కేసులో ఎవరి పేర్లయితే ఎక్కువగా వినిపించాయో.. వాళ్లేనని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ మాఫియాను బహిష్కరించాలని.. వారి సినిమాలను ప్రజలు ఆదరించవద్దని ఈ సందర్భంగా తను శ్రీ కోరింది. దేశంలోని ప్రజలు, చట్టం, న్యాయంపై తనకు నమ్మకం ఉందని ఆమె తెలిపింది. వారి సినిమాలు చూడకండి. నా గురించి విష ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టకండి. వాళ్ల సినిమాలను బహిష్కరించండి. నన్ను వేధించిన వారికి నరకం చూపించండి అంటూ సోషల్ మీడియాలో తన ఆవేదనను వెల్లగక్కుతూ వాపోయింది. చట్టం, న్యాయం ముందు నేను ఒడిపోవచ్చు. కానీ దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉందన్న శ్రీ దత్తా.. చివర్లో జై హింద్. బై మళ్లీ కలుద్దాం అంటూ ముగించింది.