నారాయణపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం

నారాయణపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాను డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలంగాణ ఈగల్  ఫోర్స్  ఎస్పీ పీవీ పద్మజ, కలెక్టర్  సీహెచ్  ప్రియాంక, ఎస్పీ వినీత్  పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ ఈగల్ ఫోర్స్, జిల్లా పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేటలో డ్రగ్స్  వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రగ్స్  నిర్మూలనలో ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడు తనవంతు సహకారం అందించాలని సూచించారు. 

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, స్నేహితులు, పరిచయస్తులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిస్తే 1908 టోల్  ఫ్రీ నంబర్​కు సమాచారం అందించాలని కోరారు. స్కూల్స్, కాలేజీల్లో టీచర్లు, లెక్చరర్లు విద్యార్థుల ప్రవర్తనపై నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం నారాయణపేట మండలం అప్పక్ పల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్  సెంటర్ ను సందర్శించి చికిత్స పొందుతున్న యువకులతో మాట్లాడారు. డీఎస్పీలు నల్లపు లింగయ్య, ఈగల్  ఫోర్స్  ఉమ్మడి మహబూబ్​నగర్  ఇన్​చార్జి డీఎస్పీ బుచ్చయ్య, డీఎంహెచ్​వో జయచంద్ర మోహన్, సీఐలు శివశంకర్, రామ్​లాల్, సైదులు, భగవంత్ రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.