- నిలిచిన రాజధాని, కృష్ణా ఎక్స్ప్రెస్
- ఆటో డ్రైవర్అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
స్టేషన్ఘన్పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్సమీపంలో రైల్వే లైన్ పట్టా విరగడం, ఓ ఆటో డ్రైవర్ గమనించి సమాచారమివ్వడంతో పెను ముప్పు తప్పింది. సికింద్రాబాద్నుంచి సిర్పూర్కాగజ్నగర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్ఘన్పూర్లో ఉదయం ఏడు గంటలకు ఆగి కాజీపేటకు బయల్దేరింది. అంతకుముందే స్టేషన్ఘన్పూర్లోని రైల్వేగేట్ నంబర్49 సమీపంలో రైల్వే పట్టా విరిగి ఉంది. దీని మీది నుంచే సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ వెళ్లగా పెద్ద శబ్ధం వచ్చింది. గేట్సమీపంలో తోపుడు బండి దగ్గర టిఫిన్ తింటున్న స్టేషన్ఘన్పూర్ఆటో యూనియన్ అధ్యక్షుడు రాజారపు జయపాల్దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ రైలుపట్టా విరిగి కనిపించడంతో రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ఫాం వైపు ఆగి ఉన్న గూడ్స్రైలు ఇంజిన్ డ్రైవర్కు చెప్పాడు.
అతడు వాకీటాకీలో రైల్వే ఆఫీసర్లను అప్రమత్తం చేశాడు. వారి ఆదేశాలతో ఇంజినీరింగ్ విభాగం ట్రాక్మెన్ శ్యామ్, సిబ్బంది పట్టాకు తాత్కాలిక రిపేర్లు చేశారు. అరగంటపాటు శ్రమించి క్లాంప్లు బిగించారు. దీంతో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ జనగామలో 15 నిమిషాలు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ స్టేషన్ ఘన్పూర్లో 10 నిమిషాలు ఆపాల్సి వచ్చింది. తర్వాత వెళ్లే రైళ్లను గంటకు 20 కిలో మీటర్ల వేగంతో పంపించడంతో ఎటువంటి ఇబ్బంది రాలేదు. కాజీపేట నుంచి రైల్వే ఆఫీసర్లు, ట్రాక్మెన్ సిబ్బంది స్టేషన్ఘన్పూర్కు చేరుకుని విరిగిన రైలు పట్టాకు శాశ్వత రిపేర్లు చేశారు.