న్యూఢిల్లీ: గూగుల్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన రూ.1,337 కోట్ల పెనాల్టీపై స్టే ఇచ్చేందుకు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. ఈ పెనాల్టీలో 10 శాతాన్ని వెంటనే డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్లో తనకున్న ఆధిపత్యాన్ని తప్పుగా వాడుతోందని గూగుల్పై సీసీఐ భారీగా పెనాల్టీ వేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోని కొన్ని యాప్లను అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి యూజర్లకు అవకాశం ఇవ్వాలని, వాళ్లకి నచ్చిన సెర్చ్ ఇంజిన్ వారు వాడుకోవడానికి వీలు కలిపించాలని కిందటేడాది అక్టోబర్లో సీసీఐ ఆదేశించింది.
ఈ ఆర్డర్ ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తుంది. సీసీఐ ఇచ్చిన ఆర్డర్పై తాత్కాలికంగా స్టే ఇవ్వడంపై నిరాకరించిన ఎన్సీఎల్ఏటీ, దీనికి సంబంధించిన హియరింగ్ ఫిబ్రవరి 13 న చేపట్టనుంది. కన్జూమర్ల సేఫ్టీ దెబ్బతింటుందని, ఆండ్రాయిడ్ ఎక్స్పీరియెన్స్పై ప్రబావం పడుతుందని, స్మార్ట్ఫోన్ ధరలు కూడా పెరగొచ్చనే అంశాలను చూపి సీసీఐ ఆర్డర్కు వ్యతిరేకంగా ఎన్సీఎల్ఏటీకి గూగుల్ వెళ్లింది. తన డామినెన్స్ పొజిషన్ను గూగుల్ తప్పుగా వాడిందనడానికి ఆధారాలు లేవని గూగుల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సరిగ్గా హియరింగ్ చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వలేమని ఎన్సీఎల్ఏటీ పేర్కొంది. ఎన్సీఎల్ఏటీలో ఫైల్ చేయడానికి మీకు రెండు నెలలు పట్టిందని, కానీ, తీర్పు మాత్రం రెండు నిమిషాల్లో ఇవ్వాలని అడుగుతున్నారని ఎన్సీఎల్ఏటీ బెంచ్ జస్టిస్ రాకేష్ కుమార్, అలోక్ శ్రీవాస్తవ అన్నారు.