హైదరాబాద్,వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ తెలిపారు. ఎన్పీఎస్ను రద్దు చేయాలని కోరుతూ త్వరలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీ యూనివర్సిటీలో ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ప్రేమ్ చంద్ అధ్యక్షతన ఐపీఎస్ ఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ మీటింగ్లో తెలంగాణ నుంచి కటకం రమేష్తో పాటు ఏపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు కె. సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎన్పీఎస్ను తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, అలాగే కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ కాకుండా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు, కేజీబీవీ, అంగన్వాడీ టీచర్ల హక్కులను కాపాడాలని తీర్మానించినట్టు పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణ ద్వారానే టీచర్ల న్యాయమైన హక్కులను సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
