
చండీగఢ్: జీతం తీసుకుంటూ ‘పని’ చేయడంలేదని పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై బీజేపీ ఫైర్ అయింది. కేబినెట్ మంత్రిగా ఉంటూ ఆఫీసుకు రావడంలేదని బీజేపీ నేషనల్ సెక్రటరీ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ‘‘ దీనిపై నేను పంజాబ్ గవర్నర్కు లెటర్ రాశా. పంజాబ్లో రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. మంత్రిగా ప్రమాణం చేసినా సిద్ధూ విధులకు హాజరుకావడంలేదు. డ్యూటీ చేయకపోయినా ఆయన జీతం తీసుకుంటున్నారు. పెర్క్స్ (ప్రోత్సాహకాలు) అనుభవిస్తున్నారు’’ అని ఛుగ్ మీడియాకు చెప్పారు. పంజాబ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ను కోరినట్టు ఆయన తెలిపారు. ఒకవేళ మంత్రి పనిచేయడం ఇష్టంలేకపోతే ఆయన పోర్టుఫోలియోను మరొకరికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
జీతం తీసుకుంటూ పనిచేయని మంత్రి సిద్ధూపై చర్యలు తీసుకోవాలని ఛుగ్ డిమాండ్ చేశారు. టూరిజం, కల్చర్ మంత్రిగా ఉన్న నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నెల రోజుల క్రితం విద్యుత్తు శాఖను కేటాయించారు. కొత్త శాఖను తీసుకోవడం ఇష్టంలేని సిద్ధూ… ఇప్పటికీ ఆ శాఖ విధులను నిర్వహించడంలేదు. సీఎం, సిద్ధూల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు కొంతమంది మంత్రులు జోక్యం చేసుకున్నారు. దీంట్లో భాగంగానే ‘పవర్’ మినిస్టర్గా చార్జ్ తీసుకోవాలని మరోమంత్రి బ్రహ్మ మొహీంద్ర సిద్ధూను కోరినా ఆయన పట్టించుకోలేదు. బీజేపీతో పాటు శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీపార్టీ నేతలు కూడా అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య నెలకొన్న వైరంతో రాష్ట్రంలో ‘రాజ్యాంగ సంక్షోభం’ నెలకొందని
ఆరోపిస్తున్నారు.