మెదక్​ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : నీలం మధు ముదిరాజ్​

మెదక్​ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : నీలం మధు ముదిరాజ్​
  • మెదక్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్​

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు : మెదక్​ కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థిగా పార్టీ నీలం మధు ముదిరాజ్​ను ప్రకటించడంతో ఆయన పార్టీ పెద్దలను మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. గురువారం తన అనుచరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్​లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి దామోదర రాజ నర్సింహ, మైనంపల్లి హన్మంతరావులతో పాటు పలువురు పార్టీ ఇన్​చార్జీలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నీలం మధు మాట్లాడుతూ.. అందరి సహకారంతో మెదక్ పార్లమెంట్​లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇందిరాగాంధీ లాంటి మహానేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్​స్థానానికి తనను ఎంపిక చేయడం పై  పార్టీకి, పార్టీ నేతలకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరాగాంధీ హయాంలోనే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లి కాంగ్రెస్ గెలుపొందేలా కృషి చేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, పార్టీ నేతలతో పాటు ప్రతి కార్యకర్త ఆశీస్సులతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.   

నర్సాపూర్ : మెదక్​కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి నీలం మధు గురువారం కాంగ్రెస్  నియోజకవర్గ ఇన్​చార్జి ఆవుల రాజి రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​  ఆంజనేయులు గౌడ్, నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అభ్యర్థి మధు వారిని కోరారు.