నీట్ స్టేట్ ర్యాంకులు రిలీజ్.. టాప్‌‌ 50లో 22 మంది అమ్మాయిలు

నీట్ స్టేట్ ర్యాంకులు రిలీజ్.. టాప్‌‌ 50లో 22 మంది అమ్మాయిలు
  • రెండ్రోజుల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్
  • ఈ సారి సర్టిఫికెట్ల ఈసారి సర్టిఫికెట్ల  ఫిజికల్ వెరిఫికేషన్ బంద్!
  • పూర్తిగా ఆన్‌‌లైన్​లోనే కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు
  • కరోనా నేపథ్యంలో కాళోజీ హెల్త్ వర్సిటీ ఆలోచన

హైదరాబాద్, వెలుగుఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్‌‌కు రంగం సిద్ధమైంది. ఇటీవల నీట్ రిజల్ట్స్​విడుదలవగా తాజాగా స్టేట్‌‌ ర్యాంకుల జాబితా శుక్రవారం కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి చేరింది. స్టేట్‌‌ టాప్‌‌ 50 ర్యాంకర్ల వివరాలను మీడియాకు వర్సిటీ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సొంతం చేసుకున్న తుమ్మల స్నికిత స్టేట్‌‌ టాపర్‌‌‌‌గా నిలవగా జాతీయ స్థాయిలో 715వ ర్యాంకు వచ్చిన స్టూడెంట్​కు స్టేట్‌‌ 50వ ర్యాంకు వచ్చింది. మొత్తం 22 మంది అమ్మాయిలు, 28 మంది అబ్బాయిలో టాప్‌‌ 50 ర్యాంకులు పొందారు. టాప్‌‌ 50లో 32 మంది ఓసీ కేటగిరీ స్టూడెంట్లే ఉన్నారు.

డిసెంబర్ వరకు కంప్లీట్ చేయాలె

యేటా ఆగస్టు వరకే ఎంబీబీఎస్‌‌ కౌన్సెలింగ్ ముగుస్తుంది. ఈసారి కరోనా వల్ల నీట్ లేటైంది. దీంతో డిసెంబర్ వరకు కౌన్సెలింగ్ పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చారు.  జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు. దేశంలోని ఏ  ప్రాంతంలోని స్టూడెంట్లయినా ఈ  సీట్లకు పోటీ పడొచ్చు. ఎయిమ్స్‌‌ సీట్లనూ ఆలిండియా ర్యాంకుల ప్రకారమే కేటాయిస్తారు. ప్రస్తుతం నేషనల్ కోటా ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఈ కోటా సీట్ల కేటాయించాకే స్టేట్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు ఉంటుంది.  నేషనల్ కోటాకు ఇచ్చిన 15 శాతం సీట్లు పోగా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని సీట్ల నూ స్టేట్‌‌ లెవల్ ర్యాంకుల ప్రకారం కేటాయిస్తారు.

రాష్ట్రం నుంచి 28 వేల మంది క్వాలిఫై

రాష్ర్టం నుంచి ఈసారి 50,392 మంది స్టూడెంట్లు నీట్ రాశారు. ఇందులో 28,093 (55.75 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. వీళ్ల మార్కులు, ర్యాంకులు, కేటగిరీ వివరాలు అందడంతో, కన్వీనర్ కోటా తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసేందుకు హెల్త్ వర్సిటీ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. నవంబర్ ఒకటి లేదా రెండో తేదీన షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందని వర్సిటీ వీసీ డాక్టర్‌‌ కరుణాకర్‌‌‌‌రెడ్డి తెలిపారు. అయితే ఇంతకుముందులా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌ ఫిజికల్‌‌గా చేయాలా వద్దా పరిశీలిస్తున్నామని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా పూర్తిగా ఆన్‌‌లైన్‌‌లోనే కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు.