V6 News

అహంకారం వద్దు.. టీడీపీ నేతలకు లోకేష్‌ సీరియస్ వార్నింగ్

అహంకారం వద్దు..  టీడీపీ నేతలకు లోకేష్‌ సీరియస్ వార్నింగ్

పదవి వచ్చిందనే అహంకారం ఎక్కడా కనిపించకూడదని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. ఏపీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవంలో లోకేష్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. శిక్షణ తరగతులకు హాజరైన ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.. నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. పార్టీ మిమ్మల్ని ఎలా గుర్తించిందో మీరు కూడా క్షేత్రస్థాయి నాయకత్వాన్ని అలాగే గౌరవించాలని స్పష్టం చేశారు.

ప్రతి మూడు నెలలకోసారి నాయకుల పనితీరుపై సమీక్ష ఉంటుందని ఈ సందర్భంగా నేతలకు సూచించారు లోకేష్.   మీ ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠకు అద్దం పడుతుంది. మీరు చేసే ప్రతి మంచి పని పార్టీకి బలాన్నిస్తుందన్నారు.   పార్టీ నిర్మాణం, నిర్వహణ , ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు.  నిన్నటి వరకు ఒక లెక్క.. నేటి నుంచి మరో లెక్క.. సమన్వయంతో  క్రమశిక్షణతో ముందుకు సాగుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నేతలకు లోకేష్ పిలుపునిచ్చారు