గాలివానకు జూ అతలాకుతలం

గాలివానకు జూ అతలాకుతలం

సమయం సాయంత్రం 4 గంటలు. వీకెండ్ కావడంతో నెహ్రూ జూలాజికల్ పార్కుకు జనం పోటెత్తారు. అప్పటిదాకా చెమటలు కక్కించిన సూర్యుడు కనుమరుగయ్యాడు. చీకట్లు కమ్మాయి.వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా పెను గాలులు విరుచుకుపడ్డాయి. భారీ వర్షం మొదలైంది. గాలుల ధాటికి పార్కులోని 50నుంచి 60 భారీ చెట్లు నేలకొరిగాయి. కరెంటుతీగలు తెగిపడ్డాయి. చెట్ల కొమ్మలు మీదపడటంతో పుప్పాలగూడకు చెందిన నిఖత్ సుల్తానా(60)చనిపోయారు. జూపార్క్ ను చూడటానికి ఆమెకుటుంబంతో కలిసి వచ్చారు. భారీ వర్షం కురవడంతో ఓ చెట్టు కింద కూర్చున్నారు. అదేసమయంలో చెట్టు కొమ్మలు విరిగి సుల్తానాపై పడ్డాయి. జూ ఆఫీసర్లు సుల్తానా కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన సందర్శకులకు జూ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. బ్యాటరీ వెహికల్స్, సఫారి బస్సుల సాయంతో సందర్శకులను జూబయటకు తీసుకొచ్చారు. వర్షం , ఈదురుగాలులకు జూ పార్కింగ్ కూడా దెబ్బతిన్నట్లు క్యూరేటర్ తెలిపారు. భారీ వర్షం వల్ల ఆదివారం జూలోబ్యాటరీ వెహికల్స్, సఫారీ , టాయ్ ట్రైన్ రైడ్స్ ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.