
ఖాట్మండు: ఎవరెస్టును ఒక్కసారి ఎక్కితేనే రికార్డు. అదే 24 సార్లు ఎక్కితే. ప్రపంచ రికార్డు. నేపాల్కు చెందిన 50 ఏళ్ల షెర్పా కమి రిట మంగళవారం 24వ సారి ఎవరెస్టునెక్కి తన సొంత రికార్డును బద్దలుకొట్టారు. ఎక్కువసార్లు ఎవరెస్టునెక్కిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. మంగళవారం ఉదయం 6.38 గంటలకు నేపాల్ వైపు నుంచి ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాన్ని (8,848 మీటర్లు) కమి ఎక్కారని సెవెన్ సమ్మిట్ ట్రెక్ కంపెనీ చైర్మన్ మింగ్మా షేర్పా చెప్పారు. ఆయనతో పాటు ఇండియాకు చెందిన పోలీసుల బృందం కూడా ఉందన్నారు. ప్రస్తుతం వాళ్లు కిందకు దిగుతున్నారని చెప్పారు. 8 వేల కన్నా ఎక్కువ ఎత్తున్న కే2, చో ఓయు, అన్నపూర్ణ లాంటి చాలా పర్వత శిఖరాలను కమి ఇప్పటికే ఎక్కారన్నారు. కనీసం 25 సార్లైనా ఎవరెస్టునెక్కాలని కమి నిర్ణయించుకున్నారని చెప్పారు. 1994 నుంచి ఎవరెస్టును కమి ఎక్కుతున్నారు. ఈ ఏడాది మే 14న ఎవరెస్టు క్లైంబింగ్ రూట్ను నేపాల్ ఓపెన్ చేసింది. 1953లో ఎడ్మండ్ హిల్లరీ, షేర్పా తెన్సింగ్ నార్కే తొలిసారి ఎవరెస్టును ఎక్కారు. ఇప్పటివరకు 4,400 మంది ఎక్కారని నేపాల్ టూరిజం శాఖ వెల్లడించింది.