
కొత్త బిజినెస్లు పెరిగినయ్!
కిందటేడాదితో పోలిస్తే 8% పెరుగుదల
ఎకానమీలో కనిపిస్తున్న రికవరీ సంకేతాలు
ఈ ఏడాది తెలంగాణలో 10,179 కొత్త రిజిస్ట్రేషన్లు
బిజినెస్డెస్క్, వెలుగు: ఇండియన్ ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయి. వ్యాక్సిన్లను తెచ్చేందుకు వివిధ ఫార్మా కంపెనీలు రెడీ అవుతున్నాయి కూడా. ఈ ఏడాది నమోదైన కొత్త వ్యాపారాల రిజిస్ట్రేషన్లను గమనిస్తే ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో ఉందనే విషయం అర్థమవుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్యలో 1,61,589 కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్స్(ఎల్ఎల్పీ) లు రిజిస్టర్ అయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఎంసీఏ) డేటా చెబుతోంది. గతేడాది ఇదే టైమ్లో రిజిస్టర్ అయిన బిజినెస్ల కంటే ఇది ఎనిమిది శాతం ఎక్కువ. కరోనా వలన ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయినప్పటికీ కొత్త బిజినెస్ల రిజిస్ట్రేషన్లు పెరగడం గమనార్హం.
అగ్రికల్చర్ బిజినెస్లు ఎక్కువయ్యాయి..
కొత్త బిజినెస్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటకలలో జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్లు 3 శాతం పెరిగాయి. రిజిస్ట్రేషన్ల పరంగా ఆరో స్థానంలో ఉన్న గుజరాత్, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 22 శాతం గ్రోత్ను నమోదు చేసింది. అగ్రికల్చర్, రిలేటెడ్ సెక్టార్లకు చెందిన బిజినెస్ల రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 35 శాతం ఎక్కువగా జరిగాయి. రుతు పవనాలు బాగుండడం, దేశంలో పంట విస్తీర్ణం, ప్రొడక్షన్ పెరగడం వంటి కారణాలతో ఈ సెక్టార్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్కు చెందిన బిజినెస్ల రిజిస్ట్రేషన్లు 2019 తో పోలిస్తే ఈ ఏడాది 27 శాతం పెరిగాయి. మెటల్స్, కెమికల్స్, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ వంటి మాన్యుఫాక్చరింగ్ సబ్సెక్టార్లకు చెందిన బిజినెస్ల రిజిస్ట్రేషన్లూ మంచి గ్రోత్ను నమోదు చేశాయని ఎంసీఏ డేటా చెబుతోంది. ఎక్కువగా ఫుడ్ ప్రొడక్షన్ సెగ్మెంట్ 77 శాతం గ్రోత్ను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బిజినెస్ సర్వీసెస్ సెగ్మెంట్ నుంచి కొత్త బిజినెస్ల రిజిస్ట్రేషన్లు 5 శాతం తగ్గాయి. అయినప్పటికీ ఈ ఏడాది జరిగిన కొత్త బిజినెస్ల రిజిస్ట్రేషన్లలో ఈ సెక్టార్ వాటా(30శాతం) నే ఎక్కువగా ఉంది. కాగా, కొన్ని సార్లు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదా డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఈ కంపెనీ ఎటువంటి బిజినెస్ను జరపవు. కేవలం ఎంసీఏ డేటానే కాకుండా లేటెస్ట్ ఫండింగ్ ట్రెండ్స్ కూడా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి రిజిస్ట్రేషన్లు పెరిగాయని విషయాన్ని తెలుపుతున్నాయి. ఈ ఏడాది అగ్రి బిజినెస్లకు ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ కంపెనీల నుంచి వచ్చిన ఫండింగ్ 64 శాతం పెరిగిందని వెంచర్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ బిజినెస్లకు ఎక్కువగా ఫండింగ్ వచ్చిందని తెలిపింది. పెరుగుతున్న కొత్త బిజినెస్ల రిజిస్ట్రేషన్లు ఎకానమీ రికవరీ అవుతోందనే సంకేతాలను ఇస్తున్నాయని ఎనలిస్టులు అన్నారు. ఈ ముమెంటం ఇలానే కొనసాగుతుందో లేదో చూడాలని చెప్పారు.
హైదరాబాద్లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు..
అగ్రికల్చర్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లకు చెందిన కొత్త బిజినెస్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. బిజినెస్ సర్వీసెస్ సెక్టార్కు చెందిన బిజినెస్ల రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. జనవరి–నవంబర్ మధ్య రిజిస్టర్ అయిన కొత్త బిజినెస్లలో మెజార్టీ వాటా(53 శాతం) హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై రిజిస్ట్రార్ ఆఫీస్లలో జరిగాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ రిజిస్ట్రర్ ఆఫీస్లలో కొత్త బిజినెస్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీన్ని బట్టి కరోనాకు ముందు నుంచే ఎకానమీ స్లోడౌన్లో ఉందని తెలుస్తోంది. కరోనా లాక్డౌన్తో మార్చి నుంచి మే మధ్యలో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. తిరిగి జూన్ నుంచి కొత్త బిజినెస్ల రిజిస్ట్రేషన్లు పుంజుకోవడం ప్రారంభించాయి. పైన పేర్కొన్న ఆరు రిజిస్ట్రార్ ఆఫీస్లలో జూన్–నవంబర్ మధ్య కాలంలో ఏడాది ప్రాతిపదికన కొత్త రిజిస్ట్రేషన్లు 46 శాతం పెరిగాయి. ఈ ముమెంటం డిసెంబర్లో కూడా కొనసాగితే ఈ ఏడాది కొత్త బిజినెస్ల రిజిస్ట్రేషన్లు డబుల్ డిజిట్ గ్రోత్ను నమోదు చేస్తాయి.
For More News..