న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. మూడు పొరుగు దేశాల్లోని మైనార్టీలకు పౌరసత్వం ఇచ్చేందుకే చట్టం తీసుకువచ్చామని ఆయన అన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో నితిన్ మాట్లాడారు. CAAపై ముస్లింలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతుందని గడ్కరీ విమర్శించారు.
ఈ చట్టం తీసుకురావడం ద్వారా దేశంలోని ముస్లింలకు ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేయడం లేదన్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశస్థులు, చొరబాటుదారులకు వ్యతిరేకంగానే ఈ చట్టాన్ని రూపొందించామని ఆయన అన్నారు.
సమాజ అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన సహాయం చేయలేదన్న విషయాన్ని ముస్లింలు అర్థం చేసుకోవాలని, వారి కుట్రను అడ్డుకోవాలని గడ్కరీ అన్నారు.