హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైమరీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం కొత్త జేఏసీ ఏర్పాటైంది. పలు ప్రైమరీ టీచర్స్ సంఘాలు ఏకమై ‘ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ పరిరక్షణ సమితి’ పేరుతో జేఏసీని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జీఓ 25ను సవరించాలని కోరుతూ ఏప్రిల్లో చలో హైదరాబాద్ నిర్వహించాలని నిర్ణయించాయి. సోమవారం హైదరాబాద్లోని పీటీఏ–టీజీ ఆఫీసులో టీఎస్పీటీఏ, పీఎస్ హెచ్ఎంఏ, పీటీఏటీజీ, పీఎస్టీయూ, ఎస్జీటీఎఫ్, టీజీపీటీఏ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన జేఏసీని ప్రకటించారు.
రాబోయే రేషనలైజేషన్ కు ముందే జీఓ 25ను సవరించాలని జేఏసీ డిమాండ్ చేసింది. 1 నుంచి 20 మంది స్టూడెంట్లు ఉన్న బడికి ఇద్దరు టీచర్లను, 50 మంది వరకు ఉంటే ఐదుగురిని నియమించాలని కోరింది. రద్దు చేయాలనుకుంటున్న ఎస్జీటీ పోస్టులను పీఎస్ హెచ్ఎంలుగా మార్చి, మొత్తం 10 వేల పోస్టులు మంజూరు చేయాలని తీర్మానించింది.
