పైసలిస్తేనే కొత్త రేషన్​ కార్డ్!..మీసేవా నిర్వాహకులు, ఆర్ఐల కుమ్మక్క!

పైసలిస్తేనే కొత్త రేషన్​ కార్డ్!..మీసేవా నిర్వాహకులు, ఆర్ఐల కుమ్మక్క!
  • రూ.5 వేలు ఇస్తే వెంటనే దరఖాస్తుల పరిశీలన, జారీ
  • నత్తకు నడకలు నేర్పుతున్న ఫీల్డ్​లెవెల్ ​తనిఖీలు  
  • 2.80 లక్షల దరఖాస్తుల్లో 2.50 లక్షలు పెండింగ్​లోనే..

హైదరాబాద్​సిటీ, వెలుగు:గ్రేటర్​పరిధిలో కొత్త రేషన్​కార్డుల కోసం దరఖాస్తు చేసి.. వస్తాయని ఎదురుచూస్తున్న చాలా మంది ఆశలు ఫలించడం లేదు. అప్లై చేసి రెండు, మూడునెలలు దాటుతున్నా ఇప్పటి వరకూ ఫీల్డ్​లెవెల్​లో సర్వే చేయక ఎవరికీ కార్డులు రావడం లేదు. ఇదే అదనుగా కొందరు బ్రోకర్లు రెచ్చిపోతున్నారు. రేషన్​కార్డుల దందా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. కొందరు మీసేవా కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు..అధికారులతో కుమ్మక్కయి రూ.4వేల నుంచి 5వేల వరకు తీసుకుని కార్డులు ఇప్పిస్తున్నారు. 

వీరితో పౌరసరఫరాల శాఖకు చెందిన కొందరు ఆర్ఐలు కూడా మిలాఖత్​అవుతున్నారు. వీరు బ్రోకర్ల నుంచి వచ్చే దరఖాస్తులకే ప్రాధాన్యత ఇస్తూ తనిఖీ చేసి 15 రోజుల్లో వారికి కార్డులు వచ్చేలా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా స్పందించకపోవడంతో కొత్తరేషన్​కార్డుల ఇప్పించే దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. 

దరఖాస్తు చేసేప్పుడే షురూ..

200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500లకే గ్యాస్​సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్​కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుండంతో అది పొందడం తప్పనిసరిగా మారింది. దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే, దరఖాస్తులు రాగానే సర్కిళ్ల వారీగా వాటిని విడదీసి ఆయా సర్కిళ్లలోని ఆర్ఐల ద్వారా ఫీల్డ్​విజిట్​చేయించాల్సి ఉంటుంది. 

తనిఖీ చేసి అధికారులు ఓకే చేస్తే వెంటనే కార్డులు మంజూరతున్నాయి. ఇక్కడే పెద్దయెత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో కొందరు మీసేవా కేంద్రాల నిర్వాహకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అప్లై చేసుకునేటప్పుడే దరఖాస్తుదారులతో మాట్లాడి బేరం కుదుర్చుకుని కార్డులు త్వరగా వచ్చేలా చేస్తామని నమ్మించి డబ్బులు తీసుకుంటున్నారు. దీంతో కార్డు వస్తుందన్న ఆశతో చాలామంది డబ్బులు చెల్లిస్తున్నారు. 

ఇందులోంచే అధికారులకు ముడుపులు ముట్టజెప్తున్నారు. దీంతో డబ్బులిచ్చిన వారి దరఖాస్తులకే అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటినే ముందు క్లియర్​చేస్తున్నారు. దీంతో మూడు నెలల కింద అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు అలాగే పెండింగ్​లో ఉంటున్నాయి. దీంతో వారు ఎప్పుడు కార్డు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.  

భారీగా దరఖాస్తులు పెండింగ్​

కొత్త రేషన్​కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటుండడం, తొందరగా క్లియర్​చేయకపోవడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్​లో పడిపోతున్నాయి. గ్రేటర్​పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకూ 2.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్తున్నారు.

 వీటన్నింటినీ ఫీల్డ్​లెవెల్​లో పరిశీలించేందుకు అవసరమైన సిబ్బంది లేరని, అయినా తమ భుజాన వేసుకుని చేస్తున్నామని సివిల్​సప్లయీస్​అధికారులు అంటున్నారు. అయినా, వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకూ10 శాతం కూడా పరిశీలించలేదని వారే అంగీకరిస్తున్నారు. కొత్త దరఖాస్తులే కాకుండా రేషన్​కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పుల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొందరు ఆర్ఐలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 

రోజుల తరబడి దరఖాస్తులను వారి వద్దనే ఉంచుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడమో లేదా డబ్బులు ఇవ్వడమో చేస్తేనే అప్రూవ్​చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రేషన్​కార్డులు ఉన్న వారు ఇంటికి వచ్చిన కొత్త కోడలి పేరు చేర్చడం కోసం, ఎవరైనా పుట్టినప్పుడు వారిని రేషన్​జాబితాలో చేర్చడం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎందరో నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. వీరిలో కూడా డబ్బులిచ్చినవారి పనినే ముందుగా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.