కోడికత్తి కేసు.. విచారణకు హాజరు కాని సీఎం జగన్

కోడికత్తి కేసు.. విచారణకు హాజరు కాని సీఎం జగన్

అమరావతి : ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై మంగళవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణకు నిందితుడు శ్రీనివాసరావు, సిఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ హాజరయ్యారు. దినేష్ కుమార్ ప్రత్యక్ష సాక్షి, ఆయనను కోర్టు ప్రస్నించి వివరాలు తెలుసుకుంది. బాధితుడు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని గతంలో ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. కానీ బాధితుడైన సీఎం జగన్ హాజరు కాలేదు. మరోసారి బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ.. ఎన్‌ఐఏ కోర్టు తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. ఘటన జరిగినప్పటి నుండి నిందితుడు శ్రీనివాసరావు జైల్లోనే ఉన్నారు. బెయిల్ కూడా రాలేదు. దాడికి వాడిన కోడి కత్తి గురించి న్యాయమూర్తి ఆరా తీశారు. దానిని తమ ముందు ప్రవేశపెట్టాలని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించింది.   

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై కోడికత్తితో దాడి

కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు విచారణ 2019లో వైజాగ్ ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత ప్రస్తుత జగన్ పై కోడి కత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన పెను సంచలనంగా మారింది. అప్పట్లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరవ్వాల్సి ఉండేది. అందుకే ప్రతి గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర నిలిపివేసి వెంటనే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరేవారు. ఇలా ప్రతీ వారం వస్తూండే సరికి ఎయిర్ పోర్టు క్యాంటీన్‌లో పని చేసే శ్రీను అనే వ్యక్తి  వీఐపీ లాంజ్‌లోకి వెళ్లడానికి అవకాశం దొరకబుచ్చుకున్నాడు. టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో వెళ్లాడు. చిన్న కోడికత్తితో దాడి చేశాడు. చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్ చేరుకున్న తరవాత ప్రస్తుతం లోటస్ పాండ్‌కు దగ్గరగా ఉన్న సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది. శీను జగన్ అభిమాని అని, జగన్ పై సానుభూతి రావడం కోసం చేశారని పోలీసులు తేల్చారు. అయితే వైసీపీ నేతలు అప్పట్లో బీజేపీతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా ఎన్‌ఐఏ విచారణకు తెచ్చుకున్నారు. ఆ కేసుని చేతుల్లోకి తీసుకున్న ఎన్‌ఐఏ కోడికత్తి శీనును జైలుకు పంపి కాస్త విచారణ జరిపి నిజమేంటో  దర్యాప్తు చేస్తోంది.

చార్జిషీట్లు దాఖలు చేసిన ఎన్ఐఏ

 ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగిస్తునే ఉంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ ఇప్పించాలని అతని కుటుంబ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసింది. జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉన్న  శ్రీనివాస్ కు బెయిల్ కోరుతూ అతని కుటుంబ సభ్యులు చేసుకున్న దరఖాస్తులను ఇప్పటికే కోర్టు కొట్టి వేసింది. కోడి కత్తితో దాడి తర్వాత అరెస్టైన శ్రీను అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా మగ్గిపోతున్నాడు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో జగన్ నుంచి నిరభ్యంతర పత్రం కోసం శ్రీను తల్లి తండ్రులు సీఎం క్యాంపు కార్యాలయానికి తిరుగుతునే ఉన్నారు. అయినా జగన్ నుంచి ఎటువంటి స్పందనాలేదు. 

బాధితునిగా జగన్ కోర్టుకు హాజరైతే కేసు కొలిక్కి

ఈ కేసులో సీఎం జగన్ బాధితుడు.. ఆయన కోర్టుకుహాజరై జరిగిందేమిటో వాంగ్మూలం ఇస్తే కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. కానీ సీఎం జగన్ హాజరు కావడంలేదు. ఈ క్రమంలో కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోంది.