మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు

మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఆఫీసర్లు మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బాబు ఆరోపించారు. మహిళలకు నైట్ డ్యూటీలు వేయొద్దని సీఎం కేసీఆర్ చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల రాణిగంజ్ డిపోలో ఓ మహిళా కండక్టర్ కు నైట్ డ్యూటీ వేశారని, రాత్రి 9:30 గంటలకు డిపోకు రావాల్సిన బస్సు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి 12 గంటలకు డిపోకు వచ్చిందని చెప్పారు. దీంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. మహిళలు సెకండ్ షిఫ్ట్ ఇవ్వాలని కోరుతుంటే… అధికారులేమో ఎర్లీ మార్నింగ్ లేదా సాయంత్రం షిఫ్టు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మహిళలు లీవ్ అడిగినా ఆఫీసర్లు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వీటన్నింటిపై ఫిర్యాదు చేయాలని మహిళా కండక్టర్లకు సూచించారు.