రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా, సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’. రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడు. బి.వి.సి ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం సారథి స్టూడియోస్లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టారు. లయన్ వెంకట్ కెమెరా స్విచాన్ చేయగా, ఫస్ట్ షాట్ కు టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ దర్శకత్వం వహించారు.
అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ ‘హారర్, థ్రిల్లర్ అంశాలతో ఆసక్తికరంగా ఉండే చిత్రమిది. ఆమనితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఇక ఇలాంటి చిన్న సినిమాలు నిలబడితేనే ఇండస్ట్రీలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న నిర్మాతలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు తీసుకురావాలి’ అని అన్నారు.
దర్శకుడు రోశిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ ‘మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, నిమ్మకాయ చుట్టూ ఉన్న అపోహలను కథాంశంగా తీసుకుని ఆలోచింపజేసేలా, వినోదాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నాం’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
