- పలుచోట్ల డీజే యాజమానుల బైండోవర్
మంచిర్యాల, వెలుగు: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టం వినియోగానికి అనుమతి లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సాధారణ మైకులను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా డీజేలు పెట్టి రూల్స్ అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు డీజే యజమానులు, ఆపరేటర్లు, గణేశ్ మండపాల నిర్వాహకులతో మీటింగులు నిర్వహించి రూల్స్ గురించి వివరించారు. డీజేలకు బదులుగా సాధారణ మైకులు ఏర్పాటు చేసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే నడిపించాలని సూచించారు. నిరుడు జిల్లావ్యాప్తంగా 2,300 మండపాలను ఏర్పాటు చేయగా, ఈసారి కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉన్నది.
కేసులు, బైండోవర్లు...
నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో శనివారం జరిగిన గణేశ్ విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టం ఉపయోగించిన నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ సిస్టంను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్తోపాటు పలుచోట్ల సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం డీజే యజమానులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు.
నిబంధనలు పాటించాలి : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు. సాధారణ మైకులు మాత్రమే వినియోగించాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ప్రకారం నడుచుకోవాలి. ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా వేడుకులు జరుపుకోవాలి. డీజే యజమానులు, మండపాల నిర్వాహకులు, భక్తులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలి. ఎవరైనా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. - భాస్కర్, డీసీపీ మంచిర్యాల
