ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఎవరికీ లేదు

ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఎవరికీ లేదు

జమ్మికుంట రైతు సమన్వయ సమితి సమావేశంలో మంత్రి హరీష్ రావు
కరీంనగర్:
రైతులను ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఎవరికీ లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం జమ్మికుంటలో రైతు బంధు/రైతు సమన్వయ సమతి సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈటల విమర్శలపై స్పందించి హరీశ్ రావు..  నన్ను తిట్టడం కాదు.. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలు రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెచ్చిన రైతు చట్టాలు నల్ల చట్టాలని నేను కాదు..గతంలో ఈటల రాజేందర్ చెప్పాడు, ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతానన్నాడు ఈటల, మరి ఇప్పుడు అమిత్ షా, మోడీ.. ఈటల రాజేందర్ చెవిలో ఈ చట్టాలను రద్దు చేస్తానని చెప్పారా? అని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయించిన తర్వాతే హుజురాబాద్ రైతులను ఓట్లు అడగాలని ఆయన డిమాండ్ చేశారు.
రోజుకో కేంద్ర మంత్రిని తెచ్చి మాట్లాడిస్తున్న ఈటల.. నేను ఇక్కడికి వస్తే విమర్శిస్తున్నాడు
హుజూరాబాద్ కు రోరజుకో కేంద్ర మంత్రిని తెచ్చి మాట్లాడిస్తున్న ఈటల రాజేందర్.. నేను ఇక్కడికి వస్తే విమర్శిస్తున్నాడని మంత్రి హరీష్ రావు అన్నారు. కేరళ నుంచి మురళీధరన్ వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చుకానీ.. నేను ఈ రాష్ట్ర మంత్రిగా, ఉద్యమకారుడిగా ఇక్కడికి వస్తే తప్పా..? అని ప్రశ్నించారు. నేనంటే ఎందుకంత భయం రాజేందర్ గారు..నేనమన్న అంటినా, నేనేమన్నా చేస్తినా ? నామీద ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. నోటికొచ్చినట్లు తిడుతున్నాడు.  ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. నేనట రాత్రి పూట ఇండ్లలోకి తిరుగుతున్నాడట.. నాకు అంత అవసరముందా ? అని ప్రశ్నించారు. ఆయనకే ఓటమి భయం పట్టుకుందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హర్యానాలో ఉన్న బండారి దత్తాత్రేయ, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, సంజయ్ లాంటి వాళ్లంతా నీ తరపున ప్రచారం చేస్తే తప్పు లేదు గానీ.. నేనొస్తే తప్పా ? అని మంత్రి హరీష్ రావు నిలదీశారు. 
రాష్ట్ర బీజేపీ అంతా ఇక్కడ ప్రచారం చేస్తుంటే.. నేనొక్క మంత్రిని వస్తే తప్పా ?
రాష్ట్ర బీజేపీ అంతా ఇక్కడ ప్రచారం చేస్తుంటే.. నేనొక్క మంత్రిని వస్తే తప్పా ? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నేనేమని చెప్పాను.. కేవలం  కేంద్రం పెట్రోలు, డీజీల్, గ్యాస్ ధరలు పెంచారని, ప్రభుత్వ సంస్థలు ప్రయివేటీకరిస్తున్నారని నిజం చెప్తే ఎందుకు ఆగమవుతున్నావు? నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుందా? డీజిల్ ధరలు, పెట్రోలు ధరలు పెరగలేదా? ఒక్క ఏడాదిలో ట్రాక్టర్ దున్నే కూలీ మూడు వేలు పెరగలేదా?  అలాంటి పార్టీలోకి ఈటల రాజేందర్ ఎందుకు పోయినట్లు?  నల్ల చట్టాలపై ఆనాడు మాట్లాడింది తప్పని ఈటల చెంపలు వేసుకోవాలి..  లేదంటే నల్ల చట్టాలు రద్దు చేయించి, పెరిగిన ధరలు తగ్గించాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏమని చెప్పి హుజురాబాద్ రైతుల ఓట్లను ఈటల రాజేందర్ అడుగుతాడు? కాళేశ్వరం నీళ్ల తూము దగ్గరుంది హుజురాబాద్.. తూము లేపితే.. తొలి చుక్క అందేది హుజురాబాద్ కే.. గతంలో హుజురాబాద్ లో నీళ్ల కోసం కొట్లాటలు జరిగేవి.. ఈసారి వేసవిలో నీరు ఎక్కువై.. చాలు బంద్ చేయమని అడిగారని మంత్రి హరీష్ రావు వివరించారు. 
రైతులకు ఈ ప్రభుత్వం ఏయే సహాయం చేసిందో రైతుల దగ్గరే రైతు బంధు సభ్యులు చర్చ పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంట్ కోతలు, మోటర్ల కాల్చివేత, ట్రాన్స్ ఫార్మర్లు పేలడం, పొలాలు ఎండటం, ఎరువుల కోసం చెప్పులతో లైన్లు, రైతు ఆత్మహత్య చేసుకుంటే తిన్నది అరగక చనిపోతున్నారన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఐదు లక్షల బీమా రైతులకు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?  తెలంగాణ వస్తే తెలంగాణ చీకటి అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకు బెదిరిస్తే.. 9 నెలల్లో కరెంట్ తెచ్చి చూపించాడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. 24 గంటల కరెంట్ ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటానని అప్పట్లో జానారెడ్డి అన్నాడు. హర్యానాలో, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మీరే ఉన్నారు కదా.. అక్కడ ఉచిత కరెంట్ ఇస్తున్నారా..? నీటి తీరువా రద్దు చేసామా లేదా? గతంలో నీటి తీరువా, భూమి శిస్తు వసూలు చేసేవారు.. పన్నులన్నీ రద్దు చేసి రైతుకే ఎదురు ఏడాదికి పదివేలిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఇన్ని పనులు చేస్తుంటే.. బీజేపీ ఏమని చెప్పి ఓట్లడుగుతారు ? అని ఆయన నిలదీశారు. 
నన్ను తిడితే నీకేమొస్తుంది రాజేందర్ గారూ..
‘ఏసంగిలో దొడ్డు వడ్లు వేయద్దు, దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం మనకు ఉత్తరం రాసింది. సన్నవడ్లు కొనమని, దొడ్డువడ్లు కొనమని కేంద్రం చెబుతుంటే ఆ విషయం అడగక.. ఈటల రాజేందర్ నన్నెందుకు తిడుతున్నాడు. నన్ను తిడితే నీకేమొస్తుంది రాజేందర్ గారు. నీకు ఓట్లు కావాలంటే హరీశ్ రావును తిట్టడం కాదు.. ఢిల్లీకి పోయి దొడ్డు వడ్లు కొంటామని ఒప్పించు. రైతు చట్టాలు వాపస్ తీసుకుంటామని ప్రధాన మంత్రితో చెప్పించు. గా పని చేయక నన్నెందుకు తిడుతున్నాడెందుకు ఊకే..’ అని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీకి ఓటేయడమంటే మన కన్నును మన వేలితో పొడుచుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి ఓటేయడమంటే డీజిల్ ధరల పెంపను ఒప్పుకున్నట్లే, మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించినట్లే,  ఎన్నో హేళనలను తట్టుకుని తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణను బీజేపీ చేతిలో పెట్టి రైతుల బతుకులు ఆగం చేద్దామా? టీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరు, ఆ పార్టీకి రైతులు ఓటేస్తారా ? సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేసారు కాబట్టి మహిళలు ఓట్లేస్తారా..? ఉద్యోగులు, ఫించన్ దారులకు సీఎం 30 శాతం ఫిట్ మెంట్ ఇస్తే, కేంద్రం 7.5 శాతం పెంచారు. వాళ్లు కూడా ఓటేయరు. కార్మికుల శ్రమను దోచుకునే చట్టాలు తెస్తోంది బీజేపీ. వాళ్లు కూడా ఓటేయరు. దళితులైతే.. వాళ్లను వాకిట్లకే రానీయరు. ఇక వాళ్లకు ఓటేసే వర్గం ఎక్కడుంది? బీసీలకు ప్రత్యేక శాఖ పెట్టాలని కోరితే.. పెట్టకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే డిజిన్విస్ట్ మెంట్ శాఖను పెట్టారు. ఈ శాఖ అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రయివేటికరిస్తూ ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఊడగొడుతోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు అని చెప్పారు.. కానీ చిన్న నోట్లు రద్దు చేసారు. వెయ్యి నోటు రద్దై.. 2 వేల నోటొచ్చింది.బీజేపీ హయాంలో ఏ వర్గం బాగుపడిందో చెప్పాలి. ఎందుకు వాళ్లకు ఓటేయాలి అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.