సర్దు బాటు.. విధివిధానాల కోసం కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ , వెలుగు: ఇటీవల 1,000 బస్సులను పక్కకు పెట్టేసిన ఆర్టీసీ.. వాటిలో పనిచేసే 5 వేల మంది ఉద్యోగులను ఎక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ ఇన్ చార్జ్ ఎండీ సునీల్ శర్మ ఉత్వర్వులు జారీ చేశారు. కమిటీలో అడ్మినిస్ట్రేషన్ ఈడీ కన్వీనర్గా, ఇతర ఈడీలు, ఫైనాన్షియల్ అడ్వయిజర్ (ఎఫ్ ఏ) సభ్యులుగా కొనసాగనున్నారు . కమిటీ రిపోర్టును సిద్ధం చేసి ఈ నెల 17లోపు తమకు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . 1,334 అద్దె బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ను తొలగించి..!
ఆర్టీసీలో ఒక్కో బస్సుకు సగటున ఐదుగురు సిబ్బంది అనుకున్నా .. వెయ్యి బస్సుల వల్ల 5,000 మంది ఉద్యోగులు ఖాళీగా ఉండనున్నారు . వారిని ఎక్కడ సర్దుబాటు చేయాలన్నదానిపైనే కమిటీ దృష్టి పెట్టనుంది. డబుల్ డ్యూటీ, ఓటీ డ్యూటీ (ఓవర్ టైం) తొలగించే అవకాశం ఉంది. కొందరిని అద్దె బస్సుల్లో ఉపయోగించుకునే చాన్స్ ఉంది.