మెడిసిన్ లో ముగ్గురికి నోబెల్

మెడిసిన్ లో ముగ్గురికి నోబెల్

బాడీ సెల్స్​లో ఆక్సిజన్ వినియోగంపై రీసెర్చ్
ఆక్సిజన్ సెన్సింగ్ మెషినరీని కనుగొన్న కేలిన్, సెమెంజా, రాట్ క్లిఫ్
కేన్సర్, వంటి ఎన్నో రోగాల నిర్మూలనకు కొత్త దారి
2019 నోబెల్ అవార్డుల ప్రకటన ప్రారంభం

స్టాక్హోంప్రపంచ ప్రఖ్యాత నోబెల్ అవార్డుల ప్రకటన షురూ అయింది. సోమవారం నార్వేజియన్ నోబెల్ కమిటీ మెడిసిన్ లో ముగ్గురికి నోబెల్ అవార్డులను ప్రకటించింది. అమెరికా సైంటిస్టులు డాక్టర్ విలియం జి కేలిన్ జూనియర్, డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెంజా, బ్రిటన్​సైంటిస్టు డాక్టర్ పీటర్ జె రాట్ క్లిఫ్​ఈ ఏడాది మెడిసిన్ నోబెల్ కు సంయుక్తంగా ఎంపికయ్యారు. ‘‘మన శరీరంలోని కణాలు ఆక్సిజన్ ను ఎలా ఉపయోగించుకుంటాయి? ఆక్సిజన్ ఎంత దొరుకుతుందో అంచనా ఎలా వేసుకుంటాయి, ఎలా సర్దుబాటు చేసుకుంటాయి?” అన్న అంశంపై కీలకమైన పరిశోధన చేసినందుకు వీరికి అవార్డును ప్రకటించారు. డిసెంబరు10న స్టాక్ హోంలో వీరికి అవార్డులను అందజేస్తారు.

ముగ్గురికీ 9 మిలియన్ క్రోనార్ల (రూ. 6.52 కోట్లు) సొమ్మును సమానంగా పంచుతారు. కాగా, కేలిన్.. హొవార్డ్ హగ్స్ మెడికల్ ఇనిస్టిట్యూట్ లో రీసెర్చర్ గా ఉన్నారు. జాన్ హాప్కిన్స్ ఇనిస్టిట్యూట్ లో వాస్కులర్ రీసెర్చ్ ప్రోగ్రాం డైరెక్టర్ గా సెమెంజా, లండన్ లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్, ఆక్స్​ఫర్డ్ టార్గెట్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గా రాట్ క్లిఫ్​పని చేస్తున్నారు. నోబెల్ కమిటీ నుంచి తెల్లవారుజామునే ఫోన్ కాల్ వచ్చిందని, ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయానని కేలిన్ చెప్పారు. తమ రీసెర్చ్ కు నోబెల్ అవార్డు వస్తుందని ఊహించలేదని రాట్ క్లిఫ్​చెప్పారు. కణాలపై ఆక్సిజన్ ప్రభావం అనేది రీసెర్చ్ లలో ట్రెండీ సబ్జెక్ట్ కానందున, మొదట్లోనే కొందరు పెదవివిరిచారన్నారు.

మెడిసిన్ లో ముగ్గిరికి ప్రైజ్ ప్రకటించడంతో ఈ ఏడాది నోబెల్ బహుమతులకు తెర లేచింది. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి, సోమవారం (14వ తేదీ) ఎకానమిక్స్ నోబెల్ ప్రైజ్ విజేతలను వరుసగా ప్రకటించనున్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాధినేతలపైనే ఫైర్ అవుతూ అద్భుతమైన స్పీచ్ ఇచ్చిన పదహారేళ్ల స్వీడిష్​అమ్మాయి, క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బర్గ్ కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది.

కేన్సర్, ఇరత రోగాలపై
పోరుకు కొత్త మార్గం 

శరీరంలో కణాలు సజీవంగా ఉండేందుకు ఆక్సిజన్ అత్యవసరం. ఈ ఆక్సిజన్ ను కణాలు ఎలా వాడుకుంటాయి? కణాల జీవక్రియలు, శారీరక ప్రక్రియలను ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ప్రభావితం చేస్తాయో వీళ్ల పరిశోధనలతోనే బాగా అర్థమయ్యాయి. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ను బట్టి జీన్స్ యాక్టివిటీని నియంత్రించే ప్రత్యేక మాలిక్యులార్ మెషినరీ ఉందని వీరు గుర్తించారు. దీన్నే ఆక్సిజన్ సెన్సింగ్ మెషినరీగా పేర్కొన్నారు. ఎర్ర రక్తకణాల పుట్టుక, రక్తనాళాల తయారీ, ఇమ్యూన్ సిస్టం నిర్వహణకు ఈ మెషినరీ కీలకమని కనుగొన్నారు. ఉదాహరణకు.. ఆక్సిజన్ రెస్పాన్స్ యంత్రాంగం రక్తనాళాలు తమంతట తామే పెరిగేలా ప్రేరేపిస్తుంది. కానీ కేన్సర్ కణాలు ఈ యంత్రాంగాన్ని హైజాక్ చేసి రక్తనాళాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కిడ్నీ ఫెయిలైన పేషంట్లకు ఎనీమియా నివారణకు హార్మోన్ ట్రీట్మెంట్లు చేయాల్సి వస్తోంది. కానీ సెన్సింగ్ మెషినరీని అవసరాన్ని బట్టి యాక్టివేట్ లేదా బ్లాక్ చేయడం ద్వారా ఈ రోగాలను ఈజీగా నిర్మూలించవచ్చని చెబుతున్నారు. అందుకే.. ఆక్సిజన్ సెన్సింగ్ మెషినరీని అనుకూలంగా మలచుకుని కొత్త మందులను తయారు చేయడంపై అనేక ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇప్పుడు దృష్టి సారించాయని నోబెల్ కమిటీ పేర్కొంది.