లక్నో: బిహార్ సీఎం నితీశ్ కుమార్కు దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని విపక్ష నేత, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో తమ ప్రభుత్వంపై ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చర్యలు తీసుకునేలా నితీశ్ సర్కార్ ఆజ్ఞలను జారీ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులపై ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే కామెంట్స్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని అన్ని సర్కార్ శాఖలకు సూచించింది. దీనిపై తేజస్వీ యాదవ్ ఫైర్ అయ్యారు. నితీశ్ను అవినీతి భీష్ముడిగా పేర్కొన్న తేజస్వీ.. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని చాలెంజ్ విసిరారు.
‘60 స్కామ్ల్లో నిందితుడు, అవినీతి భీష్మ పితామహుడైన నితీశ్ కుమార్ క్రిమినల్స్ను కాపాడుతున్నారు. బిహార్ పోలీసులు లిక్కర్ అమ్ముతున్నారు. బలహీన, రాజ్యాంగ విరుద్ధ ప్రభుత్వానికి ఆయన చీఫ్గా ఉన్నారు. నిరసనకారులకు నిరసన చేసే అవకాశం ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాస్తే జైళ్లలో వేస్తున్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను విపక్ష నేత వద్దకు తీసుకెళ్లినా వారికి నచ్చడం లేదు. నితీశ్జీ.. మీరు పూర్తిగా అలసిపోయారని మాకు తెలుసు. మీరు సిగ్గుపడాలి’ అని తేజస్వీ పేర్కొన్నారు.