తిరుపతిలో కొడుకును వదిలేసిన తల్లి .. జాడ కనిపెట్టి అప్పగించిన ఆఫీసర్లు

తిరుపతిలో కొడుకును వదిలేసిన తల్లి .. జాడ కనిపెట్టి అప్పగించిన ఆఫీసర్లు
  • తల్లికి మతి స్థిమితం  లేదంటున్న స్థానికులు

కోయిలకొండ, వెలుగు : మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఏడేండ్ల కొడుకును మూడు నెలల క్రితం తిరుపతిలో వదిలి రాగా, అక్కడి ఆఫీసర్లు జాడ కనుక్కుని తీసుకువచ్చి అప్పగించారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన జ్యోతికి మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈమె భర్త శ్రీనివాసులు చనిపోవడంతో జ్యోతి, తన కొడుకు బాబు(7)తో కలిసి ఊళ్లోని బస్టాండ్ వద్ద భిక్షాటన చేస్తుండేది. ఈమె గతంలో బాబును తీసుకుని ముంబై, తిరుపతికి వెళ్లి వచ్చింది. మూడు నెలల కింద కూడా బాబును వెంటపెట్టుకుని తిరుపతికి వెళ్లింది. అక్కడ బాబు టాయిలెట్ కు వెళ్లగా వదిలేసి పారుపల్లికి వచ్చేసింది. 

బాబు తిరుపతిలోనే ఉండిపోగా, అక్కడి వారు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. బాబును వివరాలడగ్గా తన ఊరు బాంబే అని, మహబూబ్ నగర్ అని, కోయిలకొండ, పారుపల్లి అని చెప్పాడు. దీంతో వారు ఊర్ల పేర్లతో మూడు నెలలుగా గాలిస్తున్నారు. చివరకు పారుపల్లి సర్పంచ్ ను, పోలీసులను సంప్రదించగా బాబుది ఇదే ఊరని తేలింది. దీంతో బాబును తీసుకువచ్చి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అప్పగించారు. వారు పోలీసులతో కలిసి పారుపెల్లికి వెళ్లి పిల్లవాడిని తల్లికి అప్పగించారు. అమె పరిస్థితి చూసి బాబును నారాయణపేట చైల్డ్​హోంకు తరలించారు.