హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ లాక్డౌన్తో పనులు కాలేదు. ఇప్పుడు లాక్డౌన్లో సడలింపులిచ్చి ఆఫీసులు తెరుచుకునే అవకాశం కల్పించింది సర్కార్. ప్రజలూ సంతోషించారు. కానీ, ఆ సంతోషం ఎంతో సేపు లేదు. ఆఫీసులు ఓపెన్ అయినా పనులు మాత్రం జరగట్లేదు. కారణం, కరోనా..! జీహెచ్ఎంసీ ఆఫీసులో కరోనా కలకలం రేపుతోంది. పది మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన ఆఫీసుతో పాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో పౌర సేవల్ని నిలిపివేశారు. 15 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. దీంతో అర్జీలు పట్టుకుని ఆఫీసులకు వస్తున్న జనాలు నిరాశతో వెనక్కి వెళ్లిపోతున్నారు.
50% మంది ఉద్యోగులతోనే…
ఆదివారం ప్రధాన కార్యలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆఫీసు మొత్తాన్ని శానిటైజ్ చేశారు. సోమవారం ఉద్యోగులందరినీ అధికారులు ఇళ్లకు పంపించారు. నాలుగో అంతస్తులోని ఉద్యోగులకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. మొత్తంగా ప్రధాన ఆఫీసుతో పాటు ఆరు జోనల్ ఆఫీసులు, 30 సర్కిల్ ఆఫీసుల్లో పౌర సేవలను నిలిపేశారు. 50 శాతం మంది ఉద్యోగులతోనే పని చేయిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజేషన్ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. కేవలం సర్వీస్సెంటర్లోకి ఆస్తి పన్ను కట్టేవారిని మాత్రమే అనుమతిస్తున్న అధికారులు.. వేరే పనుల కోసం వచ్చిన వారిని మాత్రం అనుమతించట్లేదు. ప్రధాన ఆఫీసులోని పోనివ్వట్లేదు. అన్ని పౌర సేవలను నిలిపేశారు. మంగళవారం పారిశుధ్య నిర్వహణ, ఇంటి నిర్మాణ అనుమతి, పింఛన్, బర్త్, డెత్ సర్టిఫికెట్లు, సర్టిఫికెట్లలో మార్పుల కోసం వచ్చిన వారిని లోపలికి పంపలేదు. దీంతో కొందరు సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అత్యవసర పనుల కోసం పెట్టుకునే అర్జీలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.
పది మందికి పాజిటివ్
గ్రేటర్లో కరోనా కట్టడికి బల్దియా బాధ్యతలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి గైడెన్స్ ఇస్తోంది. అయితే, కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. సిటీలో ఇప్పటిదాకా జీహెచ్ఎంసీకి చెందిన ఇద్దరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు బిల్ కలెక్టర్లు, ఆరుగురు పారిశుధ్య సిబ్బందికి కరోనా సోకింది. వైరస్ కట్టడిలో ముందుండి పనిచేస్తున్న వారికీ వైరస్ సోకుతుండడంతో తోటి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్లో సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని పారిశుధ్య కార్మికుడు కరోనాతో చనిపోయాడు. మే మొదటి వారంలో లంగర్హౌస్కు చెందిన పారిశుధ్య విభాగం సూపర్వైజర్కు కరోనా సోకింది. ఇటీవల సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీకి చెందిన పారిశుధ్య కార్మికుడికీ కరోనా పాజిటివ్ వచ్చింది. శనివారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఆదివారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని హెల్త్ విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు ఆఫీసు మొత్తాన్ని శానిటైజ్ చేశారు. ఉద్యోగి విధులు నిర్వహించిన నాలుగో అంతస్తు మొత్తాన్ని స్ప్రే చేశారు. ఆఫీసులోకి బయటివారిని అధికారులు రానివ్వడం లేదు.