మేడిపల్లి, వెలుగు: ‘నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను.. నన్ను శివయ్య పిలుస్తున్నాడు’ అంటూ ఓ యువతి లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మేడిపల్లిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతాపూర్లోని సాయి ఐశ్వర్య కాలనీలో నివసించే బెల్లంకొండ శైలజ కుమార్తె మధు హసిత (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. రెండేండ్ల క్రితం ఓ యువకుడితో హసిత ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మందలించడంతో గత పది నెలలుగా అతనితో మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 27న ఎవరూ లేని సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఇంట్లో హసిత రాసిన లేఖ లభించింది. అందులో ‘నేను డిప్రెషన్లో ఉన్నాను.. నన్ను శివయ్య పిలుస్తున్నాడు’ అని రాసి ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.
