- టీచర్పై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం, వెలుగు: టీచర్ దాడిలో విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లికి చెందిన నిమ్మల హనుమన్లు కూతురు(15) ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ క్యాంపస్లో పదో తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 4న మ్యాథ్స్ టీచర్ హేమంత్ స్టడీ ప్యాడ్తో ఆమె చెవిపై బలంగా కొట్టాడు. దీంతో చెవికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది.
వైద్య ఖర్చులు తామే భరిస్తామని యాజమాన్యం కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చింది. అయితే సకాలంలో మెరుగైన వైద్యం అందకపోవడంతో విద్యార్థిని శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారని విద్యార్థిని తండ్రి వాపోయాడు.
టీచర్ దాడి వల్ల తమ పాప పదో తరగతి పరీక్షల్లోనూ ఫెయిల్ అయిందని చెప్పారు. శుక్రవారం ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, మ్యాథ్స్ టీచర్ హేమంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు.
