హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఏర్పాటు

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఏర్పాటు

సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి బయట అక్టోబర్ 2 న ఏర్పాటు చేయనున్న గాంధీ విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. మంత్రులతో పాటు డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు ఉన్నారు. గాంధీ ఆసుపత్రి వద్ద 16 ఫీట్ల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొవిడ్ సమయంలో గాంధీ ఆస్పత్రి అత్యద్భుత సేవలు అందించిందన్న ఆయన... అక్టోబర్ 2న సీఎం చేతుల మీదుగా ఉదయం10 గంటలకు విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందని వెల్లడించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడతారని చెప్పారు. నెల్సన్ మండేలా లాంటి వారు కూడా గాంధీ చూపిన అహింసా మార్గాన్నే అవలంభించారని చెప్పారు. కేసీఆర్ సైతం 14 ఏళ్ళు అహింసా మార్గంలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేపట్టి తెలంగాణను సాధించారని చెప్పుకొచ్చారు.

మహాత్ముడి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ అక్టోబర్ 2 న  సికింద్రాబాద్ లో గాంధీకి నివాళులర్పిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి వచ్చి ... అక్కడ ఏర్పాటు చేసిన 16 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. ఈ విగ్రహాన్ని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీని వదిలి గాడ్సేని కొలుస్తున్న వ్యవస్థను చూస్తున్నామన్న తలసాని... స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇటీవల గాంధీ సినిమా ప్రదర్శిస్తే లక్షల మంది వీక్షించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.