ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడం కోసం ఆపరేషన్ సిందూర్ మా హక్కు: రాజ్‎నాథ్ సింగ్

ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడం కోసం ఆపరేషన్ సిందూర్ మా హక్కు: రాజ్‎నాథ్ సింగ్

బీజింగ్: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్‎పై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి రాజ్‎నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాంఘై సహకార సంస్థలో సభ్య దేశమైన పాకిస్థాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని.. దాయాది దేశ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఎస్‎సీవోలోని ఇతర సభ్య దేశాలు గళం విప్పాలని కోరారు. పహల్గామ్ దాడుల తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి ప్రతిస్పందనగా రాజ్‎నాథ్ సింగ్ పేర్కొన్నారు. 

ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడం కోసం ఆపరేషన్ సిందూర్ మా హక్కు అని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టామని క్లారిటీ ఇచ్చారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని విధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయని పాకిస్థాన్ పై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందన్నారు. 

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న దేశాలను ఎస్‎సీవో విమర్శించడానికి వెనుకాడకూడదని కోరారు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ ప్రదర్శిస్తోందని తేల్చి చెప్పారు. ఉగ్రవాద కేంద్రాలు ఇకపై సురక్షితంగా ఉండవని ఆపరేషన్ సిందూర్ ద్వారా మేం చూపించాం. భవిష్యత్‎లో కూడా వాటిని లక్ష్యంగా చేసుకోవడానికి మేము వెనుకాడమని చెప్పారు. యువతలో రాడికలైజేషన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మనం కూడా చురుకైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.